1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (19:24 IST)

ఉచిత వ్యాక్సిన్‌పై రుసుము వసూలు చేస్తారా? కేంద్రంపై సుప్రీం సీరియస్

దేశంలో ఉచిత వ్యాక్సిన్‌పై కేంద్రం అవలంబించే విధానాలపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. అంతేగాకుండా 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారికి వ్యాక్సిన్లపై రుసుము వసూలు చేయడం సహేతుకం కాదని స్పష్టం చేసింది. 45 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తూ.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారికి రుసుము వసూలు చేయడం సహేతుకం కాదని స్పష్టం చేసింది. 
 
18-44 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిన అవసరాన్ని సుప్రీం నొక్కి చెప్పింది. తొలి రెండు విడతల్లో కేంద్రం వ్యాక్సిన్లను ఉచితంగానే అందించిందని గుర్తు చేసింది. ఆ తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులు వ్యాక్సిన్లను కొనుగోలు చేసి, ప్రజల నుంచి కొంత మొత్తం వసూలు చేసి టీకా ఇచ్చేందుకు కేంద్రం అనుమతించడం సబబు కాదని సుప్రీం స్పష్టం చేసింది. 
 
కొవిడ్‌ రెండో దశ వ్యాప్తిలో ఎక్కువ మంది బాధితులు ఈ వయస్సు వారేనని అభిప్రాయపడింది. అంతేకాకుండా వైరస్‌ ప్రభావం కూడా వీరిపై ఎక్కువగానే ఉందని, చాలా మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వెల్లడించింది. 
 
కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ విధానాన్ని సుమోటోగా తీసుకున్న సుప్రీం ఇవాళ విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చాలా కీలకమని వ్యాఖ్యానించింది. వ్యాక్సినేషన్‌ అమలు విధానంలో చాలా లోపాలు ఉన్నాయనీ, వెంటనే వాటిని సమీక్షించి, నివృత్తి చేసుకోవాలని కేంద్రానికి స్పష్టం చేసింది.
 
డిసెంబరు 31 నాటికి అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. ఎలా ముందుకెళ్తారన్న దానిపై రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని సుప్రీం ఆదేశించింది. వ్యాక్సిన్‌ ధరలపై కేంద్రం మరోసారి పరిశీలించాలని చెప్పింది. వ్యాక్సిన్‌ కొనుగోలు వివరాలను, వ్యాక్సిన్‌ విధానానికి సంబంధించిన అన్ని పత్రాలు కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. బ్లాక్‌ ఫంగస్‌ ఔషధాల సమీకరణకు ఎలాంటి చర్యలు చేపట్టారో వివరించాలని సుప్రీం ఆదేశించింది.