శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Modified: ఆదివారం, 9 ఆగస్టు 2020 (16:11 IST)

నెల్లూరులో దారుణం, మాజీ సైనికుడు కరోనాతో మృతి, అతడి భార్యను గేటు బయటే కూర్చోబెట్టిన యజమాని

నెల్లూరు జిల్లా గూడూరులో వున్న కోవిడ్ క్వారంటైన్ సెంటర్లో వున్న కోవిడ్ బాధితులు రోడ్డెక్కారు. కోవిడ్ పాజిటివ్ వచ్చి లక్షణాలు లేని వారిని గాంధీనగర్ లోని ఎన్టీఆర్ హౌసింగ్ భవన సముదాయంలో ఉంచారు. అయితే ఇక్కడున్నవారి గురించి అసలు పట్టించుకోవడం లేదని కోవిడ్ వున్నా వేడి నీటిని కూడా ఇవ్వడం లేదని ఆహారం విషయంలో కూడా ఇదే పరిస్థితి వుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
 
అధికారులు మాత్రం తాగునీరు, ఆహారం అందచేస్తామని అంటున్నప్పటికి కాంట్రాక్టర్ మూలంగా భోజనం రాలేదని తెలుస్తోంది. ఇప్పటికైనా అదికార యంత్రాగం కోవిడ్ బాధితుల పట్ల నిర్లక్ష్యం వీడనాడాలని వీరు కోరుతున్నారు. మరోవైపు కరోనా మూలంగా మాజీ సైనికుడి భార్యకు అవమానం జరిగింది.
 
నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం కట్టెల వీధికి చెందిన మాజీ సైనికుడు వి నాగేశ్వర రావు(68) పది రోజులుగా ఆరోగ్య పరిస్థితి బాగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. విషయం తెలుసుకున్న వాలంటీర్లు అతనికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీనికితోడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హుటాహుటిన తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
 
అయితే ఆసుపత్రికి చేరేలోగా మార్గమధ్యంలో మృతి చెందాడు నాగేశ్వర్రావు. అనంతరం అతని మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. భర్త మృతదేహాన్ని ఇవ్వకపోవడంతో ఇతని భార్య సుమతి శనివారం వేకువజామున రెండు గంటలకు వెంకటగిరి కట్టెలు వీధిలో ఉన్న ఇంటికి చేరుకోగా ఇంటి యజమాని ఆమెను ఇంట్లోకి రానీయకుండా ఇంటికి తాళాలు వేసి అడ్డుకున్నారు.
 
ఇంటికి తాళం వేయడంతో ఇంటి బయటే ఆమె లగేజీతో కూర్చొని రోదించారు. కరోనా టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్ అయితేనే ఇంట్లోకి రానిస్తానని యాజమాని చెప్పాడు. సమాచారం తెలుసుకున్న అధికారులు చాలాసేపటి వరకు పట్టించుకోకపోవడంతో ఇంటి వెలుపల ఉండిపోయింది.