శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 మే 2020 (17:29 IST)

కరోనా సోకి భర్త మృతి.. జాడలేడని కేటీఆర్‌కు ట్వీట్.. గాంధీ ఆస్పత్రి వివరణ

వనస్థలిపురంలో ఓ వ్యక్తి కరోనా వైరస్ కారణంగా మృతి చెందడం మిస్టరీగా మారింది. ఈ మేరకు అతని భార్య తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడం కలకలం రేపింది. కరోనా చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి వెళ్లిన తన భర్త ఎక్కడున్నారో తెలియడం లేదంటూ ఆమె కేటీఆర్‌కు ట్వీట్ చేసింది. వనస్థలిపురంలో నివాసముండే తాము కరోనా బారిన పడితే.. ఆస్పత్రి నుంచి కోలుకుని ఇంటికి తిరిగి వచ్చామని తెలిపింది. అయితే తన భర్త జాడ కనిపించట్లేదని పేర్కొంది. 
 
ఇంకా ఏప్రిల్‌ 27న తన భర్తను కింగ్‌ కోఠి ఆసుపత్రిలో చేర్చుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 30వ తేదీన గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారని.. మే ఒకటో తేదీన తన భర్త మృతి చెందారని.. మే 2న అంత్యక్రియలు పూర్తి చేశామని ఆస్పత్రి సిబ్బంది చెప్పారని, అయితే ఆ విషయంలో తమ నుంచి అనుమతి తీసుకోలేదని, మృతదేహాన్ని గుర్తించేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని మాధవి అనే ఆ మహిళ వాపోయింది. 
 
ఈ వ్యవహారంపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు స్పందించారు. ఈ నెల ఒకటో తేదీన గాంధీ ఆస్పత్రిలో చేరిన కరోనా సోకిన వ్యక్తి మధుసూదన్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించామని.. నిర్లక్ష్యంగా వుండలేదన్నారు. గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే నాటికే మధుసూదన్ అనే వ్యక్తి ఆరోగ్యం క్షీణించిందని వివరించారు. 
 
ఇంకా గాంధీలో చేరిన 23 గంటల్లో వ్యక్తి చనిపోయాడని సూపరింటెండెంట్ తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చెప్పే పోలీసులకు ఇచ్చామని చెప్పారు. కుటుంబ సభ్యుల నుండి తీసుకున్న సంతకాలు కూడా తమ రికార్డ్స్‌లో ఉన్నాయని నొక్కి చెప్పారు. కుటుంబ సభ్యులు దహన సంస్కారాలకి ముందుకు రాకపోతే ఆ కార్యక్రమాలను జీహెచ్ఎంసీ నిర్వహిస్తుందని రాజారావు పేర్కొన్నారు.