మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (17:48 IST)

ఆసీస్ క్రికెటర్‌ దాతృత్వం.. పీఎం కేర్‌కు విరాళం... భారత క్రికెటర్లకు ఏమైంది?

భారత కరోనా కోరల్లో చిక్కుకుంది. కరోనా పాజిటివ్ కేసులు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా తారాస్థాయిలోనేవుంది. భారత్‌లో నెలకొన్న పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా, దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. 
 
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్ భారత్‌లో ప్రస్తుత పరిస్థితుల పట్ల చలించిపోయాడు. తనవంతుగా పీఎం కేర్స్ ఫండ్‌కు 50 వేల డాలర్ల విరాళం ప్రకటించాడు. ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. విరాళం ప్రకటిస్తున్నట్టు కమిన్స్ ఓ ప్రకటనలో తెలిపాడు.
 
"అనేక సంవత్సరాలుగా భారత్ రావడాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను. ఇక్కడివాళ్లు ఎంతో సహృదయులు. ఇంత మంచివాళ్లను నేనెప్పుడూ చూడలేదు. కానీ వీళ్లు ప్రస్తుతం అనుభవిస్తున్న వేదన చూసిన తర్వాత నేను తీవ్రంగా విచారిస్తున్నాను. అయితే భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో ఐపీఎల్ కొనసాగించడం సమంజసమేనా అనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో నేను చెప్పేది ఏంటంటే.... కఠిన లాక్డౌన్ తరహా ఆంక్షల నడుమ ప్రజలకు ఐపీఎల్ కొద్దిపాటి ఉపశమనం కలిగిస్తుందన్న కోణంలో భారత ప్రభుత్వం ఆలోచిస్తుందని భావిస్తున్నాను.
 
ఇక ఆటగాళ్లుగా మేం ఐపీఎల్ ద్వారా కోట్లాది మందికి చేరువ అవుతున్నాం. ఈ ప్రజాదరణను మేం మంచిపనుల దిశగానూ ఉపయోగించుకోవాలి. ఆ ఆలోచనతోనే పీఎం కేర్స్ ఫండ్‌కు 50 వేల డాలర్లు విరాళంగా ప్రకటిస్తున్నాను. ముఖ్యంగా, దేశంలో ఆక్సిజన్ సరఫరా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో నా విరాళాన్ని ఆ దిశగా ఉపయోగించాలని కోరుకుంటున్నా. భారత్ తపన, ఔదార్యం పట్ల ప్రభావితులైన ఐపీఎల్‌లోని ఇతర ఆటగాళ్లు, ఇతరులు కూడా విరివిగా విరాళాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తున్నా.
 
కరోనాతో కన్నుమూసినవారి పట్ల ఎంతో బాధపడుతున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో నిస్సహాయంగా మిగిలిపోతున్న వారి పట్ల వ్యక్తమయ్యే భావోద్వేగాలను కార్యరూపం దాల్చేలా చేసి, బాధితుల జీవితాల్లో వెలుగులు నింపాలి. నేనిస్తున్న విరాళం ఏమంత పెద్దది కాదని తెలుసు కానీ, అది ఏ కొందరికైనా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను' అని కమిన్స్ భావోద్వేగంతో కూడిన ప్రకటన చేశారు. అయితే, దేశంలో నెలకొన్న పరిస్థితులపై భారత క్రికెటర్లు ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం.