శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (09:42 IST)

రోహిత్ శర్మకు మొండిచేయి... సిరాజ్‌కు లక్కీఛాన్స్.. రాహుల్‌కు ప్రమోషన్...

భారత క్రికెట్ జట్టు త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ప్రస్తుతం యూఏఈ గడ్డపై జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్ ఫైనల్ పోటీ ముగిసిన తర్వాత అక్కడ నుంచే ఆస్ట్రేలియాకు కోహ్లీ సేన బయలుదేరి వెళ్లనుంది. ఈ పర్యటన కోసం భారత క్రికెట్ జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. 
 
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో మూడు ఫార్మాట్లకు విడిగా జట్లను ప్రకటించారు. ఐపీఎల్‌లో గాయపడిన రోహిత్ శర్మకు ఆసీస్ బెర్తు దక్కలేదు. ఐపీఎల్ తాజా సీజన్‌లో విశేషంగా రాణిస్తున్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌కు ప్రమోషన్ లభించింది. టీ20, వన్డే ఫార్మాట్లలో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా రాహుల్‌ను నియమించారు. 
 
అంతేకాదు, ఈ ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న తమిళనాడు కుర్రాడు వరుణ్ చక్రవర్తి టీమిండియాలో స్థానం దక్కించుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న వరుణ్ చక్రవర్తి ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో బీసీసీఐ సెలెక్టర్లను మెప్పించాడు. 
 
ఇక ఫాస్ట్ బౌలర్ ఇషాంత శర్మ కూడా పక్కటెముక గాయంతో ఐపీఎల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మతో పాటు ఇషాంత్ శర్మ పేరును కూడా బీసీసీఐ ప్రకటించలేదు. 
 
ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు:
కోహ్లీ(కెప్టెన్‌), ధవన్‌, మయాంక్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్, మనీష్‌పాండే, హార్దిక్‌పాండ్యా, సంజూ శామ్సన్, జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, చాహల్‌, బుమ్రా, షమీ, షైనీ, దీపక్‌చాహర్‌, వరుణ్‌చక్రవర్తి. 
 
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు: 
విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్ మాన్ గిల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్. 
 
ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు ఇదే: 
విరాట్ కోహ్లి(కెప్టెన్‌), మయాంక్‌, పృథ్వీషా, కేఎల్‌.రాహుల్‌, పుజారా, రహానే, హనుమ విహారి, శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్ సాహు, పంత్, బుమ్రా, షమీ, ఉమేష్‌, షైనీ, కుల్‌దీప్‌, జడేజా, అశ్విన్‌, సిరాజ్.