1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2023 (22:44 IST)

వరల్డ్ కప్ ఫైనల్ - భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగే కార్యక్రమాలివే...

ind vs aus final
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ మెగా టోర్నీలో భాగంగా, ఈ నెల 19వ తేదీ ఆదివారం రోజున అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల అంతిమ పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు వాయుసేన విమానాల విన్యాసాలను నిర్వహించనుంది. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్లకు సత్కారం చేస్తారు. ముఖ్యంగా, గాయకుడు ప్రీతమ్ సంగీత కచేరీని ఏర్పాటు చేశారు. 
 
కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు లీగ్ దశ నుంచి సెమీ ఫైనల్ వరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో గెలుపొందుతూ ఫైనల్‌కు చేరింది. దీంతో భారత క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆదివారం జరిగే ఫైనల్‌లోనూ ఆస్ట్రేలియా జట్టును చిత్తు చేసి మరోమారు అంటే ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా నిలవాలని ముక్కోటి దేవతలను కోరుకుంటున్నారు.
modi stadium
 
అదేసమయంలో ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మలిచేందుకు బీసీసీఐ తన వంతు కృషి చేస్తుంది. ఇందుకోసం ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు పలు కార్యక్రమాలను నిర్వహించనుంది. భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ విమానాలతో ఎయిర్ షోను నిర్వహించేలా ప్లాన్ చేసింది. ఈ వైమానిక విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. 
 
ఆ తర్వాత ఇప్పటివరకు ప్రపంచ కప్‌లు గెలిచిన వివిధ జట్ల సారథులను సత్కరించనున్నారు. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్లకు బీసీసీఐ ప్రముఖులు ప్రత్యేక బ్లేజర్లను బహకరించనున్నారు. తర్వాత గాయకుడు ప్రీతమ్ సంగీత కచేరీని ఏర్పాటు చేసింది. కాగా, ఈ ప్రపంచ కప్ మ్యాచ్‌ను స్వయంగా స్టేడియంలో వీక్షించేందుకు వీలుగా భారత్, ఆస్ట్రేలియా దేశాల ప్రధానమంత్రులు స్వయంగా హాజరువుతున్నారు.