1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (18:43 IST)

ఏంటి..? శిఖర్ ధావన్‌పై ఫిర్యాదా? ఏం చేశాడంటే?

టీమిండియా ఓపెనర్, గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్‌పై ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఓ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో శిఖర్ ధావన్ మీద పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చారు. ఇంతకీ అతడు చేసిన నేరం ఏంటంటే.. పక్షులకు ఆహారం పెట్టడం. వాటిని చేతులతో పట్టుకోవడం. ఇటీవల శిఖర్ ధావన్ లక్నోలో పర్యటించాడు. అక్కడ కొన్ని పక్షులకు ఆహారం అందించాడు. వాటికి సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. 
 
అయితే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతుంటే.. వలస పక్షులకు ఆహారం అందించడం ద్వారా, వాటిని పట్టుకుంటే బర్డ్ ఫ్లూ వ్యాపించే ప్రమాదం పొంచి ఉందని, శిఖర్ ధావన్ అవేవీ పట్టించుకోలేదంటూ వారణాసికి చెందిన ఓ న్యాయవాది కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం టీమిండియా బ్యాట్స్‌మెన్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. కేసు విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది.
 
శిఖర్‌ ధావన్‌ గతవారం వారణాసి పర్యటనకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో  సరదాగా ఓ బోటులో తిరుగుతూ అక్కడి పక్షులకు ఆహారం వేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పక్షులకు మేత తినిపించడం ఎంతో సంతోషంగా ఉందంటూ ధావన్ పేర్కొన్నాడు. 
 
ఈ ఫోటోలు వైరల్‌ కావడంతో వారణాసి కలెక్టర్‌ స్పందించారు. ధావన్‌ విహరించిన బోటు యజమానిపై చర్యలకు ఆదేశించారు. దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న తరుణంలో పక్షులకు మేత వేయడం నిషిద్ధం. అయితే బోటులో పక్షులకు ఆహారం వేసేందుకు పర్యాటకులను ఎలా అనుమతిస్తారని మేజిస్ట్రేట్ ప్రశ్నించారు. వీటిపై పర్యాటకులకు అవగాహన ఉండకపోవచ్చు. బోటు యజమానులు విషయం చెప్పకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు.