1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 మే 2024 (12:08 IST)

ఐపీఎల్ 2024 : ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు

royal challenges
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా, శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుతంగా ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థాయి నుంచి ఏకంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌పై 27 పరుగుల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్‌లో నాలుగో స్థానాన్ని ఖరారు చేసుకుంది. దీంతో ఆర్సీబీ ఆటగాళ్లతో పాటు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 
 
ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, అతడి భార్య అనుష్క శర్మ భావోద్వేగానికి గురయ్యారు. ఏమాత్రం ఆశలు లేని స్థితి నుంచి ప్లే ఆఫ్స్‌కు చేరడంతో విరాట్ కన్నీళ్లను అదుపు చేసుకోలేకపోయాడు. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన అనుష్క శర్మ కూడా ఎమోషనల్‌కు గురయ్యారు. ఆమె కూడా కళ్లు చెమర్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
కాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలవలేకపోయింది. ఈ సారి ప్లే ఆఫ్స్‌కు చేరడంతో ఆ జట్టు ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు. కాగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఆదివారం జరగనున్న చివరి రెండు మ్యాచ్‌ల ఫలితాల ఆధారంగా ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఏయే జట్ల మధ్య జరగనున్నాయనేది ఖరారుకానుంది. 
 
ఐపీఎల్‌ 2024 : విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు - క్రిస్ గేల్ తర్వాత అతడే... 
 
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. శనివారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన కీలకమైన పోరులో చెన్నైపై 27 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు విజయం సాధించింది. ఇరు జట్ల పాయింట్లు (14) సమమైనప్పటికీ చెన్నై (+0.392) కంటే నెట్‌రన్‌రేట్‌ ఎక్కువగా ఉండటంతో బెంగళూరు (+0.459) నాకౌట్‌కు వెళ్లిపోయింది. ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విరాట్ కోహ్లీ కొత్త రికార్డును సృష్టించాడు. సీఎస్‌కేపై కేవలం 29 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. ప్రస్తుతం సీజన్‌లో ఇప్పటివరకు 14 మ్యాచుల్లో మొత్తం 708 పరుగులు చేసిన కోహ్లీ వద్దే ఆరెంజ్‌ క్యాప్‌ ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్‌ చరిత్రలోనే రెండు సీజన్లలో 700కు పైగా స్కోర్లు నమోదు చేసిన తొలి భారత క్రికెటర్‌గా అవతరించాడు. ఓవరాల్‌గా రెండో ఆటగాడు. కోహ్లీ కంటే ముందు క్రిస్‌ గేల్ మాత్రమే ఈ జాబితాలో ఉన్నాడు. గేల్‌ 2012లో 733, 2013లో 708 పరుగులు చేశాడు. వరుస సీజన్లలో ఇన్ని పరుగులు చేసిన ఆటగాడు మరెవరూ లేరు. 
 
అంతేకాకుండా, ఈ సీజన్‌లో 708 పరుగులు చేసిన కోహ్లీ స్ట్రైక్‌రేట్‌ 155.60. ఇప్పటివరకు ఐపీఎల్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ ఇదే. ప్రస్తుత సీజన్‌లో తన స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వచ్చినా.. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా కోహ్లీ చెలరేగిపోతున్నాడు. 2016 ఎడిషన్‌లో అతడు ఏకంగా 974 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కోహ్లీ స్ట్రైక్‌రేట్‌ 152. ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ కొనసాగుతున్నాడు.
 
ఐపీఎల్ 2024 లీగ్‌ స్టేజ్‌ను విరాట్ 37 సిక్స్‌లతో ముగించాడు. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌ అతడే. ట్రావిస్ హెడ్ (36) రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లీ 2016లో మొత్తం 38 సిక్స్‌లు కొట్టాడు. ఈసారి ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. గతంలోనూ మే 18 నాడు జరిగిన మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ రాణించిన సందర్భాలే ఎక్కువ. అప్పుడు 56 నాటౌట్, 27 నాటౌట్, 113, 100 పరుగులు చేశాడు. ఈసారి కూడా 47 రన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 343 పరుగులు చేశాడు. అలాగే, భారత్‌ వేదికగా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీనే. తాజాగా సీఎస్కేపై ఇన్నింగ్స్‌తో 9 వేలకు పైగా స్కోరును నమోదు చేశాడు. అతడి తర్వాత స్థానంలో రోహిత్ (8,008) ఉన్నాడు.