1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 మే 2022 (15:13 IST)

ఢిల్లీ జట్టులో కరోనా కలకలం - నెట్ బౌలర్‌కు కోవిడ్ పాజిటివ్

delhi capitals
స్వదేశంలో ఐపీఎల్ 15వ సీజన్ పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, ఈ సీజన్‌లోని ఫ్రాంచైజీల్లో ఒకటైన ఢిల్లీ జట్టులో కరోనా కలకలం చెలరేగింది. ఈ జట్టుకు చెందిన నెట్ బౌలర్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ బౌలర్‌ను ఐసోలేషన్‌కు తరలించారు. అంతేకాకుండా, మిగిలిన ఆటగాళ్లు కూడా తమతమ హోటల్ గదులకే పరిమితం కావాలని ఆదేశించారు. దీంతో నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందా లేదా అనే విషయంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 
 
ఇదిలావుంటే, ఆదివారం ఉదయం ఢిల్లీ ఆటగాళ్లు అందరి నమూనాలను మరోసారి పరీక్షకు పంపించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫలితాల తర్వాత మ్యాచ్‌పై స్పష్టత వస్తుందని పేర్కొన్నాయి. ఢిల్లీ జట్టులో కరోనా కేసులు వెలుగు చూడడం ఇదే మొదటిసారి కాదు. 
 
గతంలో ఫిజియో ప్యాట్రిక్ ఫార్ హార్ట్, ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, టిమ్ సీఫెర్ట్ సహా ఆరుగురికి కరోనా సోకింది. దీంతో వీరిని ఐసోలేషన్‌కు వెళ్లి వచ్చారు. నేటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కేకు 11వది అవుతుంది. ఇప్పటికే ఐదు విజయాలు సాధించిన ఢిల్లీకి ఇకపై ప్రతీ మ్యాచ్ కీలకం కానుంది. టెస్ట్ ఫలితాల తర్వాత నెగెటివ్ వచ్చిన వారిని మ్యాచ్‌కు అనుమతించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.