శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (15:37 IST)

సచిన్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. స్వార్థం కోసం బ్యాటింగ్ చేసిన నువ్వు?

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా శనివారం భారత్ - ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థాన్‌పై అష్టకష్టాలు పడి గెలిచింది.


ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శన అత్యంత చెత్తగా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినప్పటికీ... ఆప్ఘాన్ ఆటగాళ్లు ప్రదర్శించిన ఆటతీరుకు నలువైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. 
 
ఈ మ్యాచ్‌లో భారత ఆటతీరుపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోనీ బ్యాటింగ్‌పై ఆయన మండిపడ్డారు. వీరిద్దరు కాస్త వేగంగా బ్యాటింగ్ చేస్తే.. భారత్ అంత స్వల్పస్కోర్‌కి పరిమితం అయ్యేది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ధోనీ-కేదార్ బ్యాటింగ్‌తో కాస్త నిరాశకు గురయ్యాయని, కేదార్, ధోనీల భాగస్వామ్యం తనకు నచ్చలేదన్నారు. 
 
అయితే ఈ కామెంట్లపై క్రికెట్ దేవుడు సచిన్‌ను నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ధోనీ బ్యాటింగ్‌పై కామెంట్లు చేసిన సచిన్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాను కేదార్, ధోనీల భాగస్వామ్యంతో సంతోషంగా లేనని సచిన్ కామెంట్స్ చేయడంపై సోషల్ మీడియా మండిపడుతోంది. తాము 34 ఓవర్లు స్పిన్ పిచ్‌లో బ్యాటింగ్ చేసి 119 పరుగులు సాధించామని సచిన్ చెప్పడంపై ధోనీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు. 
 
ఇంకా ధోనీ వీరాభిమానులు సచిన్ ఇలా కామెంట్స్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేగాకుండా సచిన్‌కు వ్యతిరేకంగా ట్విట్టర్‌లో నినాదాలు చేయడం మొదలెట్టారు. అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించిన క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను ధోనీ ఫ్యాన్స్ విపరీతంగా, నిర్దాక్షిణ్యంగా ట్రోల్ చేస్తూ.. ధోనికి మద్దతును ప్రదర్శిస్తున్నారు. 
 
అంతేగాకుండా క్రికెట్ రంగంలో సచిన్ స్వార్థం కోసం బ్యాటింగ్ చేశాడని దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ఇద్దరు ఉన్నత క్రికెటర్ల మధ్య ట్రోలర్లు చిచ్చు పెడుతూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.