1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 21 మే 2022 (11:33 IST)

సునీల్ గవాస్కర్‌పై రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ ఆగ్రహం

sunil gavaskar
భారత క్రికెట్ దిగ్గజం, టీమ్‌ఇండియా మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌పై నెటిజన్లు, రాజస్థాన్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను వెంటనే భారత టీ20 లీగ్‌లో కామెంట్రీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గతరాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ షిమ్రన్‌ హెట్‌మెయర్‌పై సన్నీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణంగా నిలిచాయి. షిమ్రన్‌ను ఉద్దేశించి గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
 
ఈ మ్యాచ్‌లో చెన్నై నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్‌ 15 ఓవర్లకు 104/4తో నిలిచింది. అప్పటికి రవిచంద్రన్‌ అశ్విన్‌ (13), షిమ్రన్‌ హెట్‌మెయర్ ‌(0) క్రీజులో ఉన్నారు. ఆ జట్టు విజయానికి చివరి 5 ఓవర్లలో 47 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలోనే ప్రత్యక్ష ప్రసారంలో కామెంట్రీ చేస్తున్న గావస్కర్‌ హెట్‌మెయర్‌ను ఉద్దేశించి ఇలా వ్యాఖ్యానించాడు. 
 
'Hetmyer's wife delivered, will Hetmyer deliver for the Royals now?' అని అన్నాడు. శాస్త్రి సరదాగా ‘డెలివర్‌’ అనే పదప్రయోగం చేశాడు. అది బెడిసికొట్టి నెటిజన్లకు కోపం తెప్పించింది. దీంతో గావస్కర్‌ వ్యాఖ్యలు నీచంగా ఉన్నాయంటూ, అవి అభ్యంతరకరం అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. వెంటనే కామెంట్రీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
 
కాగా, హెట్‌మెయర్‌ భార్య ఇటీవల ఓ బిడ్డకు జన్మనివ్వడంతో అతడు బయోబబుల్‌ వీడి స్వదేశానికి వెళ్లాడు. తర్వాత తిరిగొచ్చి గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో పాల్గొన్నాడు. అయితే, ఈ కరీబియన్‌ బ్యాట్స్‌మన్‌ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆరు పరుగులకే ఔటై నిరాశపరిచాడు. కానీ, పట్టుదలగా ఆడిన అశ్విన్‌ (40 నాటౌట్‌, 23 బంతుల్లో 2x4, 3x6), రియన్‌ పరాగ్‌ (10 నాటౌట్‌, 10 బంతుల్లో 1x6)తో కలిసి మ్యాచ్‌ను గెలిపించాడు.