శనివారం, 21 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్ - వన్డే సిరీస్ కైవసం

india batsman
ప్రపంచ కప్‌ పోటీలకు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ ఆడుతుంది. ఇందులోభాగంగా, ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది. ఫలితంగా ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి, మరో మ్యాచ్ ఉండగానే వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. 
 
ఈ మ్యాచ్‌‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బారత్... నిర్ణీత 50 ఓవర్లలో 399 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత జట్టులో దాదాపు అందరు బ్యాట్స్‌మెన్లు రాణించారు. గిల్, శ్రేయాస్‌లు సెంచరీల మోత మోగించగా, సూర్య కుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ 97 బంతుల్లో ఆరు సిక్స్‌లతో 104 పరుగులు చేయగా, శ్రేయస్ 90 బంతుల్లో 3 సిక్స్‌ల సాయంతో 105 పరుగులు చేశాడు. 
 
సూర్యకుమార్ కేవం 37 బంతుల్లో 72 పరుగులు చేసి ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. అలాగే, కేఎల్ రాహుల్ 52, ఇషాన్ కిషన్ 31 చొప్పున పరుగులు చేశారు. రెండో వికెట్‌కు గిల్ - శ్రేయస్‌లు ఏకంగా 200 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సూర్యకుమార్ మ్యాచ్ 44వ ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్స్‌లు బాదాడు. ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2, ఆడమ్ జంపా, సీన్ అబాట్‌, హేజిల్ వుడ్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు 
 
ఆ తర్వాత 400 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. తొలి తొమ్మిది ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. ఆ సమయంలో మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించారు. దీంతో మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించి ఆస్ట్రేలియా  విజయలక్ష్యాన్ని 317గా నిర్ణయించారు. 
 
అయితే, ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలో 217 పరుగులకే అన్ని వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్ల దాటికి 140 పరుగులకే ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్లను కోల్పోయింది. అయితే ఆల్ రౌండర్ సీన్ అబాట్ చివరలో దూకుడుగా ఆడాడు. 36 బంతుల్లో 54 పరుగులు చేయడంతో ఆసిస్ 217 పరుగుల వరకు వెళ్లింది. దీంతో భారత్ 99 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. భారత బౌలర్లలో జడేజా, అశ్విన్లు మూడు చొప్పున, ప్రసిద్ధ కృష్ణ రెండు, షమి ఒక వికెట్ తీశారు.