1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 19 నవంబరు 2023 (08:43 IST)

విశ్వవిజేత టైటిల్ కోసం నేడు ఆఖరి పోరాటం.. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా

yuvraj singh
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా టైటిల్ వేట కోసం ఆఖరి పోరాటం నేడు జరుగనుంది. ఈ పోరులో ఆతిథ్య భారత్, పర్యాటక ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. మరికొన్ని గంటల్లో ఈ పోరు ఆరంభంకానుంది. అయితే ఈ టోర్నీలో ఒక్కటంటే ఒక్క ఓటమి కూడా చవిచూడని భారత్ క్రికెట్ జట్టు పటిష్టమైన, పలుమార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియాతో మరోమారు తలపడనుంది. 
 
టీమిండియా మంచి ఫాంలో ఉన్నప్పటికీ అభిమానుల మనసుల్లో కొంత టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టిన అనుభవంతో టీమిండియా ఎదుర్కొనే ప్రమాదం గురించి హెచ్చరించాడు.
 
'ఆస్ట్రేలియా క్రీడాకారులకు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసు. అనేక పర్యాయాలు వాళ్లు ప్రపంచ కప్ గెలిచారు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్స్‌లోనూ పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ ఎక్కడా తొణక్కుండా బెణక్కుండా టీంను విజయతీరాలకు చేర్చారు. స్పెషలిస్టు బ్యాటర్లు అందరూ అవుటైనా తమ బాధ్యతను నిర్వర్తించారు. పెద్ద మ్యాచ్‌లకు ఆడే మానసిక ధృఢత్వం, నిలకడ ఉంది కాబట్టే వాళ్లు కీలక టోర్నీల్లో విజయం సాధించారు' అని యువరాజ్ గుర్తు చేశారు.
 
అయితే, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్నింటా అద్భుతంగా రాణిస్తున్న రోహిత్ శర్మ సేన ప్రస్తుతం ఓ పూర్తిస్థాయి టీంగా ఉందని యువరాజ్ సింగ్ కితాబిచ్చాడు. "కాబట్టి, ఈ మ్యాచ్‌లో భారత్ విఫలమయ్యే అవకాశాలు తక్కువ. అధిక పొరపాట్లతో మాత్రమే భారత్‌కు ప్రమాదం ఉంది. 2003 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగింది. ఈసారి డామినేషన్ మొత్తం ఇండియాదే. ఆస్ట్రేలియన్ క్రీడాకారులు అద్భుతంగా ఆడితే తప్ప వారు గెలిచే అవకాశం లేదు'' అని యువరాజ్ జోస్యం చెప్పారు.