శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 11 మే 2019 (13:06 IST)

ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్‌కు వేళాయే.. చెన్నై-ముంబై ఢీ.. గెలుపు ఎవరిది?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ ఫైనల్ పోటీలకు రంగం సిద్ధమైంది. మూడు సార్లు ఛాంపియన్‌‌గా నిలిచిన చెన్నై, ముంబై జట్లు ఫైనల్ పోరులో ఢీకొనేందుకు సిద్ధమయ్యాయి. కానీ తొలిసారి ఫైనల్‌ చేరాలన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ కల నెరవేరలేదు. ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌ ఐపీఎల్‌-12 ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌-2లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. 
 
దీపక్‌ చాహర్‌ (2/28), బ్రావో (2/19), జడేజా (2/23), హర్భజన్‌ (2/31) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మొదట ఢిల్లీ 9 వికెట్లకు 147 పరుగులే చేయగలిగింది. లక్ష్య చేధనలో ఢిల్లీ తరపున బరిలోకి దిగిన ధావన్‌ చకచకా మూడు బౌండరీలు బాదినా.. ఇన్నింగ్స్‌ పేలవంగానే ఆరంభమైంది. బాట్స్‌మెన్‌కు ఏమాత్రం స్వేచ్ఛనివ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. 
 
ఇక చెన్నై, ముంబయి ఫైనల్లో తలపడనుండటం ఇది నాలుగోసారి. రెండింట్లో ఏది గెలిచినా రికార్డు స్థాయిలో నాలుగో కప్పు ఖాతాలో చేరుతుంది. తొలిసారి 2010లో చెన్నై, ముంబయి తలపడ్డాయి. ఆ టోర్నీలో ధోని బృందం టైటిల్‌ గెలిచింది. ఆ తర్వాత 2013, 2015లో చెన్నైని ఓడించి ముంబయి విజేతగా నిలిచింది. చెన్నైకిది ఎనిమిదో ఐపీఎల్‌ ఫైనల్‌ కావడం విశేషం. ఈ ఐపీఎల్‌ ఫైనల్‌కు ఆదివారం హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వనుంది.