మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 మార్చి 2020 (13:33 IST)

కివీస్ బౌలర్‌కు కరోనా వైరస్? న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా వన్డే సిరీస్ రద్దు

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అన్ని దేశాల క్రీడారంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కోవిడ్ 19 వల్ల ఇప్పటికే చాలా టోర్నమెంట్లు రద్దు చేశారు. చివరకు ఐపీఎల్ 2020 కూడా వాయిదావేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే, భారత్ - సౌతాఫ్రికా, న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్‌లు రద్దు చేశారు. 
 
మరోవైపు, తాజాగా న్యూజిలాండ్ క్రికెటర్‌కు కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. కివీస్ జట్టు పేస్ బౌలర్ లూకి ఫెర్గుసన్ తనకు గొంతు నొప్పి, జలుబు ఉందని యాజమాన్యానికి తెలపడంతో అతడిని వెంటనే ఐసోలేషన్‌కు తరలించారు. ఇక ఈ విషయాన్ని జట్టు అధికారి ఒకరు వెల్లడించారు. 
 
శుక్రవారం జరిగిన మొదటి వన్డేలో ఆస్ట్రేలియాపై 71 పరుగుల తేడాతో కివీస్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ తర్వాత పైవిధంగా తనకు లక్షణాలు ఉన్నట్లు ఫెర్గుసన్ చెప్పడంతో అతడ్ని ఐసోలేషన్‌కు తరలించి 24 గంటల పాటు పరిశీలనలో ఉంచారు. ఒకసారి టెస్టులు పూర్తి అయ్యి.. ఆ తర్వాత రిపోర్ట్స్ వచ్చాక టీమ్‌తో కలుస్తాడని ప్రకటించారు.
 
అలాగే, ఆస్ట్రేలియా పేసర్ కేన్ రిచర్డ్‌సన్‌కు కూడా ఆరోగ్యం బాగోలేదని తెలపగా.. యాజమాన్యం తొలి వన్డే ముందు కరోనా టెస్టులు జరిపారు. ఇక అతని రిపోర్ట్స్ నెగటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
 
వన్డే సిరీస్ 
ఇదిలావుండగా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రుగుతున్న చాప‌ల్‌-హ్యాడ్లీ వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌కు క‌ష్ట‌కాలం వ‌చ్చింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో.. ఆ రెండు సిరీస్‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని భావించారు. రెండు దేశాల మ‌ధ్య తొలి వ‌న్డే జ‌రిగినా.. మిగితా రెండు వ‌న్డేల‌ను ర‌ద్దు చేశారు. 
 
న్యూజిలాండ్ ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించిన నేప‌థ్యంలో ఆ దేశ జ‌ట్టు స్వ‌దేశానికి వెళ్ల‌నున్న‌ది. బోర్డ‌ర్ ఆజ్ఞ‌లు విధించ‌డం వ‌ల్ల కివీస్ జ‌ట్టు స్వ‌దేశానికి ప‌య‌నంకానున్న‌ది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా ర‌ద్దు చేసిన‌ట్లు తెలుస్తోంది.