గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మార్చి 2020 (08:21 IST)

రెండో టెస్ట్ : భారత్ 124 ఆలౌట్... రెండో టెస్ట్‌లో కివీస్ విజయభేరీ

క్రెస్ట్ చర్చ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఫలితంగా ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ టోర్నీలో భారత్ తన రెండో ఓటమిని చవిచూసింది. 
 
అంతకుముందు... చివరిదైన రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 46 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌట్‌ అయింది. తన ఓవర్‌నైట్‌ స్కోరు 96/6తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత బ్యాట్స్‌మెన్‌‌ నాలుగో రోజు కూడా చేతులెత్తేశారు. 
 
ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా రెండోరోజే పెవిలియన్‌ చేరడంతో.. హనుమ విహారి (5), పంత్ ‌(1) ఇన్నింగ్స్‌ ఆరంభించారు. విహారి ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో 4 పరుగులు మాత్రమే జోడించి, సౌథీ బౌలింగ్‌లో వాట్లింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 
 
ఆ మరుసటి ఓవర్‌కే పంత్‌ సైతం పెవిలియన్‌ బాటపట్టాడు. ట్రెంట్‌బౌల్ట్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయిన పంత్‌.. వాట్లింగ్‌కే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా(16 నాటౌట్‌) ఒక్కడే కాసేపు కివీస్‌ బౌలర్లతో పోరాడాడు. అతడికి టెయిలెండర్ల నుంచి అస్సలు సహకారం అందలేదు. అందరూ ఇలా వచ్చి, అలా వెళ్లిపోయారు. 
 
అంటే భారత్ తన మూడో రోజు స్కోరుకు కేవలం 28 పరుగులు మాత్రమే జతచేసి, ఆలౌట్‌ అయింది. ఈ ఇన్నింగ్స్‌లో పుజారా చేసిన 24 పరుగులే అత్యధికం కావడం మన బ్యాట్స్‌మెన్‌ పేలవ వైఫల్యానికి నిదర్శనం. కివీస్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌ 4, టిమ్‌ సౌథీ 3 వికెట్లతో భారత టాపార్డర్‌ను కోలుకోనీయలేదు. గ్రాండ్‌హోమ్‌, నైల్‌ వాగ్నర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 
 
ఆ తర్వాత భారత్ నిర్దేశించిన 132 పరుగుల విజయలక్ష్య ఛేదనలో విజయం దిశగా న్యూజిలాండ్ జట్టు దూసుకెళుతోంది. ఆ జట్టు ఓపెనర్లు టామ్‌ లాథమ్‌ (52), బ్లండెల్‌ (47) తమ సమయోచిత బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించారు. అర్థసెంచరీ పూర్తి చేసుకున్న లాథమ్‌.. విజయానికి 29 పరుగులు అవసరమైన క్రమంలో ఉమేష్‌ యాదవ్‌ బౌలింగ్‌లో కీపర్‌ రిషభ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 
 
ప్రస్తుతం కివీస్‌.. 30 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 108 పరుగులు చేసింది. టామ్‌ బ్లండెల్ ‌(55), కెప్టెన్‌ విలియమ్సన్ ‌(5) చొప్పున పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఆ తర్వాత టేలర్ - నికోల్స్‌లు విజయానికి కావాల్సిన మిగిలిన పరుగులు పూర్తిచేయడంతో ఈ టెస్ట్ సిరీస్‌ను కివీస్ 2-0తో కైవసం చేసుకుంది.