1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (18:48 IST)

భారత క్రికెట్ జట్టుకు గట్టిషాక్.. ఇషాంత్ శర్మ, పృథ్వీషా డౌటేనా?

భారత క్రికెట్ జట్టుకు గట్టిషాక్ తగిలింది. న్యూజిలాండ్ గడ్డపై వరుస ఓటములతో సతమతమవుతున్న టీమిండియాకు మరో షాక్ తప్పలేదు. శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌కు టీమిండియా స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ గాయంతో దూరమైనట్లు తెలుస్తోంది. మరోసారి అతను చీలమండ గాయానికి గురైనట్లు సమాచారం. మంచి ఫామ్‌లో ఉన్న ఇషాంత్ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమవ్వడం టీమ్‌మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. 
 
స్వింగ్, పేస్ అనుకూలించే న్యూజిలాండ్ పిచ్‌లను ఇషాంత్ అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. తొలి టెస్ట్ తరహా పిచ్‌నే రెండో టెస్ట్‌కు సిద్దం చేయగా.. ఇషాంత్ సేవలు జట్టు కోల్పోవడం కోహ్లీసేనకు ప్రతికూలంగా మారింది. టెస్ట్‌ల్లో 300 వికెట్ల క్లబ్‌కు మూడు వికెట్ల దూరంలో ఇషాంత్ ఉన్నాడు. 
 
మరో యువ ఓపెనర్ పృథ్వీ షా గాయపడినట్టు తెలుస్తోంది. ఎడమ పాదంలో వాపు రావడంతో పృథ్వీ గురువారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌కు దూరమయ్యాడు. దాంతో రెండో టెస్టుకు ముందే కోహ్లీసేన ఇబ్బందుల్లో పడనుంది. వాపు ఎందుకు వచ్చిందో తెలుసుకునేందుకు పృథ్వీకి రక్త పరీక్ష నిర్వహిస్తారు. మెడికల్ రిపోర్టు అనుకూలంగా వస్తే.. అతను రెండో టెస్టులో పాల్గొంటాడో లేదో శుక్రవారం జరిగే ప్రాక్టీస్‌ సెషన్ తర్వాత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకోనుంది.