శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (17:31 IST)

కివీస్ టెస్టు ఓటమి గురించి అతిగా ఆలోచించను -కోహ్లీ

న్యూజిలాండ్ పర్యటనలో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పది వికెట్ల తేడాతో భారత్ పరాజయం పాలైంది. మ్యాచ్ ఓటమి తర్వాత కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ.. టాస్ గెలుచుకోలేకపోవడం చాలా కీలకమైందని.. ఓటమికి అదొక కారణమని పోటీ ఇవ్వలేకపోయినట్లు చెప్పాడు. తొలి టెస్టులో భారత్ పరాజయంపై ప్రజల స్పందన గురించి తాను అతిగా ఆలోచించనని కోహ్లీ వెల్లడించాడు. ఒకవేళ తాను బయటి వ్యక్తుల్లా ఆలోచిస్తే.. ఇప్పుడు తాను కూడా జట్టు నుంచి బయట ఉండేవాడిని అని కోహ్లీ పేర్కొన్నాడు. 
 
'తొలి రోజు టాస్ అనుకూలంగా పడటమనేది చాలా ముఖ్యం. బ్యాటింగ్ విభాగం ఎంత కష్టపడినప్పటికీ తగినంత పోటీ ఇవ్వలేకపోయాం. కివీస్ బౌలర్లను ఒత్తడిలోకి నెట్టామని మేం అనుకోవడం లేదు. 220-230కు మించిన స్కోరు చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. మొదటి ఇన్నింగ్సే వెనక్కిపడేలా చేసి ఒత్తిడిలోకి నెట్టేసింది' అంటూ కోహ్లీ వివరణ ఇచ్చాడు. 
 
కాగా.. తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. మూడో రోజు ఆట ముగిసే సరికి 65 ఓవర్లలో 4 వికెట్లకు 144 పరుగులు చేసిన భారత్.. నాల్గో రోజు బ్యాటింగ్ కొనసాగించి రెండో ఇన్నింగ్స్ లో 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 58 పరుగులతో మయాంక్ అగర్వాల్, 29 పరుగులతో రహానే, 25 పరుగులతో పంత్ పర్వాలేదనిపించినా.. మిగతా ఆటగాళ్లు కనీస ఆటతీరును కనబర్చలేకపోవడంతో.. 191 పరుగులతోనే సరిపెట్టుకుంది టీమిండియా. 
 
కివీస్ బౌలర్లలో సౌథీ 5/61, బౌల్ట్ 4/39తో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చారు.. 9 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు... ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయాన్ని సాధించింది.