జింబాబ్వేపై పాకిస్థాన్ గెలుపు : టీ-20 సిరీస్ కైవసం
జింబాబ్వేతో జరిగిన చివరి ట్వంటీ-20 క్రికెట్ మ్యాచ్లో పాకిస్థాన్ విజయం సాధించింది. రెండు టీ 20లతో పాటు మూడు వన్డేలు ఆడేందుకు గాను పాకిస్థాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. ట్రోఫీని గెలుచుకునే మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత ఓవర్లలో పాకిస్థాన్ ఆరు వికెట్ల నష్టానికి 136 పరుగులు సాధించింది. 137 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన జింబాబ్వే పాక్ బౌలింగ్కు తలొగ్గాల్సి వచ్చింది.
జింబాబ్వే బ్యాట్స్మెన్లు స్వల్ప స్కోరుకే వెనుదిరగడం జట్టుకు నష్టాన్ని మిగిల్చింది. విలియమ్స్ చివరి వరకు క్రీజులో నిలదొక్కుకుని 40 పరుగులు సాధించాడు. అయినప్పటికీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల పతనానికి 121 పరుగులు సాధించింది. తద్వారా పాకిస్థాన్ 15 పరుగుల తేడాతో గెలుపు నమోదు చేసుకోవడంతో పాటు ట్వంటీ-20 సిరీస్ను కూడా కైవసం చేసుకుంది.