1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (11:34 IST)

చెన్నైలో చేతిలో ఓటమికి బంతితో ప్రభావం చూపలేకపోవడమే : కోహ్లీ

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. శుక్రవారం రాత్రి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 
 
ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ, ఈ ఓటమి తనని మరింత నిరాశకు గురిచేసింది. ఈ పిచ్‌ అనుహ్యంగా నెమ్మదించిందని, దీంతో మరో 15-20 పరుగులు రాబట్టలేకపోయాం. తాము 175 పరుగులు చేసుంటే గెలిచే అవకాశం ఉండేది. మరోవైపు బంతితో ప్రభావం చూపలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు.
 
తాము బ్యాటింగ్‌ చేసేటప్పుడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆఖర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిందన్నాడు. చివర్లో స్లో బంతులు, యార్కర్లు వేసి తమని కట్టడి చేశారని పేర్కొన్నాడు. తాము మళ్లీ విజయాల బాట పట్టాల్సిన అవసరం ఉందన్నాడు. ఈ ఓటమి చాలా నిరాశకు గురిచేసిందని, కీలక సమయాల్లో తమ ఆటగాళ్లు మరింత పట్టుదలగా ఆడాలని సూచించాడు
 
అలాగే, సీఎస్కే కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ, షార్జా పిచ్‌పై తేమ ప్రభావం ఉంటుందేమోనని ఆందోళన చెందామని అన్నాడు. ‘బెంగళూరు శుభారంభం చేసింది. అయితే, తొమ్మిదో ఓవర్‌ తర్వాత పిచ్‌ కాస్త నెమ్మదించింది. పడిక్కల్‌ ఆడేటప్పుడు జడేజా స్పెల్‌ కీలకమైంది. మరో ఎండ్‌ నుంచి మొయిన్‌ అలీని బౌలింగ్‌ చేయాలని ముందే చెప్పా. కానీ డ్రింక్స్‌ సమయంలో బ్రావోని దింపాలని ప్రణాళిక మార్చుకున్న. అలాంటి పిచ్‌పై బ్రావో వరుసగా నాలుగు ఓవర్లు వేస్తే బాగుంటుందని అనిపించింది’ అని ధోనీ చెప్పుకొచ్చాడు.
 
మరోవైపు తమ బౌలర్లు పరిస్థితులను అర్థం చేసుకున్నారని, వాళ్ల బాధ్యతలేంటో తెలుసుకున్నారని ధోనీ చెప్పాడు. అలాగే యూఏఈలోని పిచ్‌లు ప్రత్యేకంగా ఉన్నాయని, అందులోనూ షార్జా పిచ్‌ మరీ నెమ్మదిగా ఉందన్నాడు. దీంతో తమ బ్యాటింగ్‌ లైనప్‌లో కుడి-ఎడమ కాంబినేషన్‌ బాగుంటుందని అనిపించినట్లు చెన్నై సారథి చెప్పాడు.