కెప్టెన్సీపై మనసులోని మాటను వెల్లడించిన రోహిత్ శర్మ
భారత క్రికెటర్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై స్పదించారు. వన్డే జట్టు బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత తొలిసారి స్పందించాడు. ఈ నిర్ణయంపై ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయకుండా, ఎంతో హుందాగా, స్పోర్టివ్ మాట్లాడాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్లో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు.
ముంబైలో జరిగిన సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డుల కార్యక్రమంలో రోహిత్ మాట్లాడుతూ, "ఆస్ట్రేలియాతో ఆడటమంటే నాకు చాలా ఇష్టం. అక్కడికి వెళ్లడం, అక్కడి ప్రజల క్రికెట్ ప్రేమను చూడటం ఎంతో బాగుంటుంది" అని వ్యాఖ్యానించాడు. కెప్టెన్సీ మార్పు గురించి నేరుగా ప్రస్తావించకపోయినా, ఒక ఆటగాడిగా సిరీస్కు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన మాటల ద్వారా స్పష్టమైంది.
ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్కు కెప్టెన్గా శుభమన్ గిల్ను నియమించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ, వారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించలేదు. ఈ ఏడాది మార్చిలో రోహిత్ సారథ్యంలోనే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన నేపథ్యంలో ఈ నిర్ణయం అభిమానులను, క్రీడా విశ్లేషకులను షాక్కు గురిచేసింది.
ఈ విషయంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందిస్తూ, కెప్టెన్సీ మార్పు గురించి రోహిత్ శర్మకు ముందుగానే సమాచారం ఇచ్చామని స్పష్టం చేశారు. "ఈ మార్పు గురించి రోహిత్తో మేం మాట్లాడాం. ఆ సంభాషణ మా మధ్య వ్యక్తిగతమైనది. కానీ, అతనికి తెలియజేయకుండా నిర్ణయం తీసుకోలేదు" అని అగార్కర్ వివరించారు.