1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (11:52 IST)

భారత్ ఉప్పు తిని.. పాకిస్థాన్‌కు సపోర్ట్ చేస్తావా? సానియాపై ఫైర్

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెట్ ఆటగాడు షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్‌ వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సానియా మీర్జా టెన్నిస్‌లో భారత్ తరఫునే ఆడుతోంది. తాజాగా దుబాయ్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సానియా మీర్జా పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడంపై సోషల్ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
 
గురువారం ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో స్టేడియంలో సానియా మీర్జా కనిపించింది. క్రికెటర్ల కుటుంబసభ్యులకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లలో సానియా మీర్జా కూర్చుని పాకిస్థాన్ జట్టుకు మద్దతు తెలిపింది. ముఖ్యంగా పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మంచి జోష్‌లో కనిపించింది. ఈ మ్యాచ్‌లో సానియా భర్త షోయబ్ మాలిక్ నిరాశపరిచినా పాకిస్థాన్ జట్టు భారీ స్కోరు చేయడంతో వారికి ఛీర్స్ చెప్పింది.
 
అయితే భారత తరఫున టెన్నిస్ ఆడుతూ పాకిస్థాన్ జట్టుకు స్టేడియంలో మద్దతు తెలపడంపై భారత క్రీడాభిమానులు సానియాపై మండిపడుతున్నారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఆడిన మ్యాచ్‌లకు హాజరుకాకుండా పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లకు హాజరై మద్దతు తెలపడాన్ని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు. భారత్ ఉప్పు తిని.. పాకిస్థాన్‌కు సపోర్ట్ చేస్తోందంటూ పలువురు నెటిజన్లు ఆమెపై కామెంట్లు చేస్తున్నారు. 
 
ఇకపై సానియా ఆడే టెన్నిస్ టోర్నమెంట్లను బాయ్‌కాట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సానియాకు పాకిస్థాన్ పౌరసత్వాన్ని ఇవ్వాలని.. భారత్ పౌరసత్వాన్ని రద్దు చేయాలని కామెంట్ల ద్వారా కొందరు నెటిజన్లు హితవు పలికారు.