శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 1 నవంబరు 2018 (16:34 IST)

క్రికెటర్లకు గొడ్డుమాంసం వద్దు.. మెనూ నుంచి తొలగించండి..

భారత క్రికెటర్ల ఆరగించే ఆహార మెనూలో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఈ మెనూలో బీఫ్ (పశుమాంసం) ఉండేది. ఆ మెనూ నుంచి దీన్ని తొలగించాలంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోరింది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డును కోరింది. 
 
ఈ యేడాది ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లిన సమయంలో టీమ్ లంచ్ మెనూలో ఓ బీఫ్ వంటకాన్ని చూసి అభిమానులు ఫైర్ అయ్యారు. దీంతో బీసీసీఐకి చెందిన ఇద్దరు అధికారులు రెండు వారాల కిందట ఆస్ట్రేలియా వెళ్లారు. క్రికెటర్ల ఆహారం, ప్రయాణ ప్రణాళిక రూపొందించేందుకు వెళ్లారు. 
 
ఇదే అంశంపై అక్కడి క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులతో మాట్లాడారు. టీమ్ మెనూలో నుంచి బీఫ్‌ను తొలగించాలని వాళ్లకు సూచించారు. రెండు బోర్డుల మధ్య కుదిరే ఎంవోయూలోనూ ఈ అంశాన్ని చేర్చాలని ఆ ఇద్దరు అధికారుల బృందం స్పష్టంచేసింది. 
 
టీమిండియా మెనూలో చాలా వరకు శాకాహార వంటకాలే ఉండాలని బోర్డు స్పష్టం చేసింది. వివిధ రకాల పండ్లు ఎక్కువగా అందుబాటులో ఉంచాలని కోరింది. టీమ్‌లో ఉన్న కొంత మంది శాకహార క్రికెటర్లకు ఇబ్బంది కలగకుండా చూసేందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 
 
దీనికోసం అక్కడి ఓ ఇండియన్ రెస్టారెంట్‌కు వెళ్లిన బోర్డు అధికారులు.. క్రికెటర్లు శాకాహార కూరలను సరఫరా చేయాలని కోరారు. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు విదేశీ టూర్లలో క్రికెటర్లు తీసుకునే ఆహారంపై బోర్డు సీరియస్‌గా దృష్టి సారిస్తున్నది. మాంసం సాధ్యమైనంత వరకు తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోనుంది. కాగా, ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా ఇండియా మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.