1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2024 (09:43 IST)

మరోమారు చెత్త ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ... వెనుకేసుకొచ్చిన కెప్టెన్ రోహిత్!!

rohith sharma
భారత క్రికెట్ జట్టుకు అత్యంత కీలకమైన మ్యాచ్‌లోనూ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోమారు చెత్త ప్రదర్శన చేశాడు. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా, గురువారం రెండో సెమీ ఫైనల్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో విరాటో కోహ్లీ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. దీనిపై క్రికెట్ విశ్లేషకులతో పాటు.. క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం పెద్ద మనసుతో కోహ్లీకి అండగా నిలబడ్డాడు. 
 
విరాట్‌కు మద్దతుగా రోహిత్ మాట్లాడాడు. కోహ్లి ఫామ్ ఆందోళన కలిగించే అంశం కాదని చెప్పాడు. అతని ఫామ్ గురించి అర్థం చేసుకోగలమని అన్నాడు. కోహ్లీ నాణ్యమైన ఆటగాడని, ఎలాంటి ఆటగాడైనా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాడని మద్దతుగా నిలిచాడు. విరాట్ ఎలాంటి ఆటగాడో, అతడి విలువేంటో తాము ఎప్పుడూ సమస్య కాదని, అతడి ఉద్దేశం ముఖ్యమని అన్నాడు. దీని ద్వారా ఫైనల్ ఆడించడం ఖాయమని అని రోహిత్ సంకేతాలు ఇచ్చాడు. ఇక ఇంగ్లండ్‌పై విజయంపై స్పందిస్తూ.. ఒక జట్టుగా చాలా ప్రశాంతంగా ఈ మ్యాచ్ ఆదామని, పరిస్థితులకు తగ్గట్టు ఆదామని వివరించాడు. చక్కటి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నామని, ఫైనల్ మ్యాచ్‌లోనూ అదే చేయాలనుకుంటున్నామని రోహిత్ చెప్పాడు.
 
మరోవైపు, ఈ మెగా టోర్నీలో విరాట్ అత్యంత దారుణంగా విఫలమయ్యాడు. మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 75 పరుగులు మాత్రమే చేశాడు. ఎంత పేలవ ప్రదర్శన చేశాడో ఈ పరుగులను చూస్తే అర్థమైపోతుంది. ఇందులో రెండు సార్లు డకౌట్ కూడా అయ్యాడు. ఇక అత్యంత కీలకమైన సెమీ ఫైనల్లోనూ ఇదే తరహా ప్రదర్శన చేశాడు. గురువారం ఇంగ్లండ్ జరిగిన మ్యాచ్లో కేవలం 9 పరుగుల కొట్టి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారత బ్యాటింగ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో రీస్ టోప్లీ వేసిన ఓవర్‌లో షాట్ ఆడబోయి ఔట్ అయ్యాడు.