జట్టు విజయం కోసం యవ్వనాన్ని ధారపోశా ... ఈ విజయం అభిమానులకే సొంతం : విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా, మంగళవారం రాత్రి గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు విజయభేరీ మోగించింది. ఐపీఎల్ చరిత్రలో గత 18 యేళ్లుగా ఊరిస్తున్న ట్రోఫీని ఆర్సీబీ జట్టు ముద్దాడింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. తద్వారా తన సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కప్ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రక విజయం జట్టు సభ్యుల్లో ముఖ్యంగా, జట్టు వెన్నెముకగా నిలిచిన స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీలో తీవ్ర భావోద్వేగాలను రేకెత్తించింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. పంజాబ్ కింగ్స్కు 191 పరుగుల సవాలుతో కూడిన లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ జట్టు ప్రతి పరుగుకూ శ్రమించాల్సి వచ్చింది. ఒక దశలో శశాంక్ సింగ్ కేవలం 30 బంతుల్లో అజేయంగా 61 పరుగులు చేసి పంజాబ్ను విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేసినప్పిటకీ ఆర్సీబీ బౌలర్లు ఒత్తిడిని జయించి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఆఖరి ఓవర్ను అత్యంత కట్టుదిట్టంగా వేసిన జోష్ హేజిల్వుడ్ బెంగుళూరుకు చిరస్మరణీయ విజయాన్ని ఆందించడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, నా హృదయం బెంగుళూరుతోనే ఉంది. నా ఆత్మ బెంగుళూరుతోనే ఉంది. నేను ఈ జట్టుకు విధేయుడిగా ఉన్నాను. వేరే ఆలోచనలు వచ్చినప్పటికీ నేను వారితోనే ఉన్నాను. వారు నాతోనే ఉన్నారు. ఇక విజయంలో గత కొన్నేళ్లుగా నాతోపాటు ఆడిన ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్కు కూడా ఉంది. వారు కూడా జట్టు కోసం చాలా ఏళ్లు ఎంతో శ్రమించారు అని కోహ్లీ అన్నారు.
పైగా, ఈ విజయం జట్టు సభ్యులదే. 18 యేళ్లుగా మద్దతుగా నిలిచిన అభిమానులది కూడా. నా యవ్వనాన్ని, నా అనుభవాన్ని, నా విధేయతను ఈ జట్టుకు అంకితం చేశాను. ఈ క్షణం నాకు సర్వస్వం అని కోహ్లీ ఒకింత భావోద్వేగంతో అన్నారు.