1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (12:36 IST)

వేరొకరితో చేసిన మొబైల్ చాటింగ్ చూపించలేదనీ ప్రియురాలిని గొంతు కోసి చంపేసిన ప్రియుడు...

lover chtting
తనతో సన్నిహితంగా ఉంటూ మరో వ్యక్తితో చేసిన మొబైల్ చాటింగ్‌ను ప్రియురాలు చూపించలేదు. దీంతో ఆగ్రహించిన ప్రియుడు.. తన ప్రియురాలిని పార్టీ చేసుకుందామని ఇంటికి పిలిచి గొంతుకోసి చంపేసిన ఘటన బెంగుళూరులో వెలుగుచూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగుళూరులోని రాజగోపాల నగరి పరిధికి చెందిన నవ్య (24) అనే యువతి హోంశాఖ కార్యాలయంలో క్లర్కుగా పని చేస్తున్నారు. ఆమె సొంతూరు రామనగర జిల్లా కనకపుర తాలూకా తామసంద్రకు చెందిన వారు కాగా, కోరమంగళలో నివాసం ఉంటూ ఉద్యోగం చేసేది. ఒకే ఊరు, దూరపు బంధువు కావడంతో ప్రశాంత్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఈయన బెంగుళూరులోని లగ్గేరి రాజేశ్‌‍ నగరులో ఉంటూ పీణ్యలోని ఓ ఫ్యాక్టరీలో ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. వీరిద్దరూ గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 
 
మంగళవారం నవ్య పుట్టిన రోజుకావడంతో శుక్రవారం పార్టీ చేసుకుందామని ప్రశాంత్ తన ప్రియురాలిని తన గదికి పిలిచాడు. మధ్యాహ్నం 3 గంటలకు కేక్ కట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. కొద్దిసేపటికి నవ్య తన మొబైల్‌లో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. దాన్ని చూపించాలంటూ ప్రశాంత్ పట్టుబట్టాడు. దీంతో వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఆగ్రహంతో ఉన్మాదిగా మారిన ప్రశాంత్.. ఆమెను కేక్ కోసిన కత్తితోనే ఆమె పీక కోశాడు. దీంతో ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది. 
 
ఆ తర్వాత ఏం చేయాలో దిక్కుతోచక.. ఆమె శరీర భాగాలను ముక్కలు చేసి గోనె సంచిలో పెట్టి దూరంగా పడేయాలని ప్లాన్ చేశాడు. అదీ సాధ్యం కాకపోవడంతో గదిలోనే శవంతో సాయంత్రం వరకు ఉన్నాడు. ఆ తర్వాత నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగినదంతా పోలీసులకు వివరించి లొంగిపోయాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నవ్య తల్లి నాగరత్నకు సమాచారం ఇచ్చి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రశాంత్‌ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.