1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: సోమవారం, 14 మార్చి 2022 (17:26 IST)

తిరుమలలో హైటెక్ దళారీ అరెస్ట్... సుప్రభాతం సేవ చేయిస్తానంటూ బురిడీ...

తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ద‌ర్శ‌న టికెట్లు, గ‌దుల కోసం భ‌క్తులు ద‌ళారులను న‌మ్మి మోస‌పోవద్దని టిటిడి సివిఎస్వో శ్రీ‌ గోపినాథ్ జెట్టి తెలిపారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేర‌కు తిరుమలలో ఒక దళారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 
కొంతకాలంగా వివిధ రకాలుగా భక్తులను మోసం చేస్తున్న దళారులు కొత్త మార్గంలో సామాజిక మాధ్య‌మాల‌ వేదికగా మోసాలు చేస్తున్నార‌ని తెలిపారు. టిటిడి ఉద్యోగులుగా, తిరుమలలో అర్చకులుగా పనిచేస్తున్నట్లు ఫేస్ బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్‌లో నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నార‌ని పేర్కొన్నారు. 

 
కొంపెళ్ల హరి నాగసాయి కార్తీక్ అలియాస్ హెచ్ఎన్ఎస్‌. కార్తీక్ అనే వ్య‌క్తి సత్యనారాయణ అవధాని అంబటిపూడి, గొల్లపల్లి శ్రీనివాస దీక్షితులు అనే పేర్ల‌తో ఫేస్ బుక్‌లో న‌కిలీ ఖాతాలు సృష్టించార‌ని తెలిపారు. వీటి ద్వారా శ్రీవారి అభిషేకం, సుప్రభాతం, తోమాల, అర్చన, విఐపి బ్రేక్‌ దర్శనం టికెట్లు ఇప్పిస్తామని భక్తుల వద్ద నుంచి 7416606642, 8185920397, 9912372268 ఫోన్ నంబ‌ర్లతో గూగుల్ పే, ఫోన్ పే యాప్‌ల ద్వారా లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేసిన‌ట్టు టిటిడి విజిలెన్స్ అధికారులు గుర్తించార‌ని వెల్ల‌డించారు. 

 
ఈ మేర‌కు ఫిర్యాదు చేయగా పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారని సివిఎస్వో తెలిపారు. హెచ్ఎన్ఎస్‌. కార్తీక్ చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్నార‌ని, అత‌నిపై త్వరలో సస్పెక్ట్ షీట్ పెడుతున్నామ‌ని సివిఎస్వో వెల్లడించారు. ఇలాంటి వారిని నమ్మి మోసపోవద్దని, టిటిడి అధికారిక వెబ్‌సైట్ ద్వారా దర్శన టికెట్ల‌ను బుక్ చేసుకోవాలని సివిఎస్వో విజ్ఞప్తి చేశారు.