1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (12:03 IST)

జార్ఖండ్ రాష్ట్రంలో 4 గంటల వ్యవధిలో ఐదుగురు ఆత్మహత్య

జార్ఖండ్ రాష్ట్రంలో నాలుగు గంటల వ్యవధిలో ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జెంషెడ్‌పూర్‌లో ఈ విషాదకర ఘటన జరిగింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఐదు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఆత్మహత్యలపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
మృతుల్లో ఒక చర్చి ఫాదర్ కూడా ఉండటం గమనార్హం. నగరంలో జరిగిన వరుస ఆత్మహత్యల దృష్ట్యా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కారణాలు తెలుసుకునే పనిలో పడింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసులను ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.
 
జంషెడ్‌పూర్‌ నగరంలోని పలు పోలీస్​ స్టేషన్ల పరిధిలో ఈ ఐదు ఆత్మహత్యలు వెలుగు చూశాయి. సూసైడ్​ చేసుకున్న వారిలో గొల్మూరి పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్చి ఫాదర్ లియో జాన్ డిసౌజా(52) కూడా ఉన్నాడు. బుధవారం ఆయన తన గదిలో ఉరివేసుకున్నారు. 
 
మరోవైపు బిర్సానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిలీప్(46) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కమల్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంకుచియాకు చెందిన జలధార్(60) అనే వృద్ధుడు, బోడం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు, సక్చి పోలీస్ స్టేషన్ సమీపంలోని రాంలీలా మైదాన్​కు చెందిన సంజయ్​ శర్మ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన వారిలో ఉన్నారు.