1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 13 జనవరి 2022 (21:28 IST)

మెడపై కత్తి పెట్టి వివాహితపై అత్యాచారం చేసిన భర్త క్లోజ్ ఫ్రెండ్

బాలానగర్‌కు చెందిన ఓ మహిళను ఎస్‌ఆర్ నగర్‌లో ఆటో రిక్షా డ్రైవర్ కత్తిని మెడపై పెట్టి బెదిరించి అత్యాచారం చేశాడు. ఇటీవల అరెస్టయిన తన భర్తకు బెయిల్ లభించేలా సహాయం చేస్తానని నమ్మబలికి ఆమెను తన ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
 
నిందితుడు మొహమ్మద్ జహంగీర్ అదే ప్రాంతానికి చెందినవాడు. బాధితురాలి భర్తకు స్నేహితుడు కూడా. భర్తను కలిసేందుకు తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడని పోలీసులు తెలిపారు. గతేడాది ఆగస్టులో ఆమె భర్త డ్రగ్స్‌ కేసులో అరెస్టయి జైలు పాలయ్యాడు.

 
ఒక లాయర్‌ని ఏర్పాటు చేసి తన భర్తకు బెయిల్ తెచ్చిపెట్టడం ద్వారా ఆమెకు సహాయం చేస్తానని జహంగీర్ ఆమెను నమ్మించాడు. ఆమె అతడి మాటలు నమ్మింది. అదే నెలలో జహంగీర్ ఆమెను అమీర్‌పేటలోని ఒక లాడ్జికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెను గదిలో బంధించి మెడపై కత్తి పెట్టి బెదిరిస్తూ ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆమె కుమారుడిని కూడా బెదిరించాడు.
 
 
అప్పట్నుంచి అదే అదనుగా తీసుకున్న జహంగీర్ ఆమెపై వేధింపులు కొనసాగిస్తూ వచ్చాడు. అతడి వేధింపులు భరించలేని బాధితురాలు బాలానగర్ పోలీసులను ఆశ్రయించింది. బాలానగర్ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి, కేసును బుధవారం అధికార పరిధిలోని ఎస్‌ఆర్ నగర్‌కు బదిలీ చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.