1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (14:03 IST)

నీతో నాకు రెండో పెళ్లేగా? మరో అమ్మాయిని ప్రేమించా, మనతో వుంటుందన్నాడు, అంతే...

విడాకులు తీసుకున్న మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లుగా బాగా సంపాదించాడు. రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టి రెండు చేతులా ఆర్జించాడు. ఈ క్రమంలో అతడికి మరో మహిళతో పరిచియం ఏర్పడింది. ఆమెతో వివాహేతర సంబంధం సాగించాడు, కానీ ఆ విషయాన్ని భార్యతో చెప్పి బలిపశువు అయ్యాడు.

 
వివరాల్లోకి వెళితే... ఏపీలోని తిరుచానూరుకి చెందిన శ్రీనివాస్ హైదరాబాదులో ఆటోడ్రైవరుగా వుండేవాడు. ఆ సమయంలో అతడికి స్వప్న అనే మహిళ పరిచయమైంది. ఆమె అప్పటికే విడాకులు తీసుకుని వుంది. ఆమెకి రాజ్ కుమార్ అనే కుమారుడు కూడా వున్నాడు. ఇవన్నీ అతడికి చెప్పింది. ఐనప్పటికీ తనను పెళ్లాడుతానని చెప్పడంతో ఓకే అనేసింది. అలా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

 
పెళ్లయిన కొన్నేళ్లకే ఆటోడ్రైవరుగా చేస్తూనే రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాడు శ్రీనివాస్. కలిసి రావడంతో కోట్ల రూపాయాల్లో డబ్బు ఆర్జించాడు. ఈ క్రమంలో అతడికి మరో యువతితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఆమెతో వివాహేతర సంబంధం సాగించాడు. ఇలా ఎన్నాళ్లు చాటుమాటుగా అనుకుని ఆమె విషయాన్ని భార్యకు చెప్పేసాడు.

 
నిన్ను నేను రెండో పెళ్లి చేసుకున్నాను కదా... నాకు మరో యువతి పరిచయమైంది. ఆమెను కూడా మనతోనే పెట్టుకుందాం అని భార్యకు చెప్పాడు. అందుకు భార్య స్వప్న ససేమిరా అన్నది. ఐతే శ్రీనివాస్ ఆమె మాటలను లెక్కచేయలేదు. ఎలాగైనా ఆ యువతిని ఇంటికి తీసుకువస్తానని చెప్పేసాడు.

 
భర్త మాటలకు తీవ్ర ఆగ్రహం చెందిన భార్య.. తన కుమారుడు, తన అక్క కుమారుడితో కలిసి భర్త శ్రీనివాస్ హత్యకు ప్లాన్ చేసింది. రూ. 5 లక్షలు సుపారీ ఇచ్చి మర్డర్ గ్యాంగ్‌ను రంగంలోకి దింపింది. అర్థరాత్రివేళ ఇంట్లోకి చొరబడ్డ నిందితులు... అనుకున్నవిధంగా శ్రీనివాస్ తలపై రోకలి బండతో మోది హత్య చేసి అతడి వంటిపై వున్న నగలు తీసుకుని శవాన్ని దూరంగా తీసికెళ్లి పారేసి వెళ్లిపోయారు. తొలుత గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ తర్వాత కూపీ లాగడంతో అసలు విషయం బయటపడింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో వున్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.