1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 26 మార్చి 2022 (11:11 IST)

నన్నే పెళ్లిచేసుకో, మరదలికి అక్కమొగుడు వేధింపులు

ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన అక్కమొగుడు మరదలి పాలిట కామాంధుడయ్యాడు. తననే పెళ్లాడాలంటూ వేధింపులకు దిగాడు. అతడి వేధింపులను తాళలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు మండలం భగవాన్ నాయక్ తండాలో శ్రీను, చిన్ని దంపతులకు ఐదుగురు కుమార్తెలు. కొన్నేళ్ల క్రితం శ్రీను కాలం చేసాడు. దాంతో కుటుంబ భారమంతా చిన్నిపై పడింది. ఐనా మొక్కవోని ధైర్యంతో తన ఐదుగురు కుమార్తెల్లో నలుగురికి పెళ్లిళ్లు చేసింది. చివరి కుమార్తెను విజయవాడలో ఓ యువకుడికి నిశ్చితార్థం చేసి ఏప్రిల్ 10న వివాహం చేయాలని అనుకున్నారు.

 
ఐతే యువతి మూడో అక్క భర్త ఆమెపై కన్నేశాడు. తననే పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. మూడో అల్లుడి వేధింపులు తాళలేక నాలుగో అల్లుడి వద్దకు వచ్చేసారు తల్లీకూతుళ్లు. కామాంధ అల్లుడు అక్కడికి కూడా వచ్చి మరదలిపై అఘాయిత్యం చేసేందుకు యత్నించడమే కాకుండా వేధింపులు తీవ్రతరం చేసాడు.

 
ఈ బాధలు భరించలేని యువతి పురుగులు మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. ఆమెను గమనించి హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం నాడు పరిస్థితి విషమించి ఆమె కన్నుమూసింది. తన మూడో అల్లుడి వేధింపుల కారణంగా తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నదని చిన్ని పోలీసులకి ఫిర్యాదు చేయడంతో నిందితుడి కోసం గాలిస్తున్నారు.