ఆన్లైన్ గేమ్ కోసం అప్పు - తీర్చేమార్గం లేకు రైలుకిందపడి ఆత్మహత్య!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆన్లైన్ గేమ్కు మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆన్లైన్ గేమ్ ఆడేందుకు రూ.3 లక్షలు అప్పు చేశాడు. దాన్ని తీర్చే మార్గం లేక రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని పరిగి మండలంలోని పైడేటి గ్రామానికి చెందిన 23 యేళ్ళ జయచంద్ర డిగ్రీ వరకు చదువుకున్నాడు. రెండేళ్ళ క్రితం గ్రామంలో పాల డెయిరీ ప్రారంభించి నడుపుతున్నాడు. పాడి రైతుల నుంచి సేకరించిన పాలకు సంబంధించి రైతులకు రూ.3 లక్షల వరకు బాకీపడ్డాడు. దీంతో పాడి రైతుల నుంచి ఒత్తిడి పెరిగిపోయింది.
మరోవైపు, ఆన్లైన్ గేమింగ్కు అలవాటుపడి రూ.3 లక్షలు అప్పు చేసి నష్టపోయాడు. దీంతో నెల రోజుల క్రితం డెయిరీని మూసేశాడు. ఉద్యోగం కోసం బెంగుళూరు వెళుతున్నట్టు శనివారం ఇంటి నుంచి బయలుదేరాడు. అదే రోజు రాత్రి హిందూపురం పట్టణ పరిధిలోని గుడ్డం సమీపంలో రైలు పట్టాలపైపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.