శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (09:16 IST)

టూర్‌కు తీసుకెళ్లిన విద్యార్థినికి మత్తుమందిచ్చి ప్రిన్సిపాల్ అత్యాచారం

victim
ఇటీవలికాలంలో అత్యాచారాలకు గురయ్యే విద్యార్థినిల సంఖ్య పెరుగుతోంది. తమ ప్రేమికులతో పాటు పోకిరీలు, కామాంధుల చేతుల్లో వారు ఇలాంటి అఘాయిత్యాలకు గురవుతున్నారు. అయితే, తమ వద్దకు వచ్చే విద్యార్థినిలను భావి పౌరులుగా తీర్చిదిద్ధాల్సిన ఉపాధ్యాయులు కూడా ఇలాంటి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా ఓ విద్యార్థిని మత్తుమందు ఇచ్చిన ఓ ప్రిన్సిపాల్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో వెలుగు చూసింది. కొందరు విద్యార్థినిలను టూర్ కోసం తీసుకెళ్లిన ప్రిన్సిపాల్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
మీరట్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ గత నెల 23వ తేదీన 9 మంది విద్యార్థినిలను విహారయాత్ర పేరుతో బృందావన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ రాత్రి బస కోసం ఓ హోటల్‌లో రెండు రూమ్‌లు అద్దెకు తీసుకున్నాడు. ఎనిమిది మందిని ఓ గదిలో ఉంచగా, 11వ తరగతి చదివే ఓ విద్యార్థినిని మాత్రం తన గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత తినే ఆహారంలో మత్తుమందు కలిపాడు. బాలికి మత్తులోకి జారుకోగానే అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
అయితే, ఆ బాలిక ప్రతిఘటించడంతో చంపేస్తానని, పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పినా ప్రాణాలు తీస్తానని హెచ్చరించాడు. టూర్ ముగించుకుని గత 24వ తేదీన ఇంటికి చేరుకున్న తర్వాత ఆ బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.