1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2022 (08:25 IST)

అత్యాచారం చేసిన నిందితుడికి ఐదు గుంజీల శిక్ష... ఎక్కడ?

victim
బీహార్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ఓ యువతిని అత్యాచారం చేసిన నిందితుడికి కేవలం ఐదంటే ఐదు గుంజీలతో శిక్ష విధించారు. తద్వారా ఆ కామాంధుడిని నిర్దోషిగా గ్రామ పంచాయతీ పెద్దలు ప్రకటించారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని నవాదా ప్రాంతం అక్బర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరుణ్ పండిట్ అనే వ్యక్తి ఓ పౌల్ట్రీలో పని చేసేవాడు. ఆ సమయంలో ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ చిన్నారి ప్రలోభపెట్టి, బలవంతంగా కామవాంఛ తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఈ దారుణాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరారు. 
 
ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెద్ద వారిని అడ్డుకున్నారు. ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్‌ వరకు తీసుకెళ్లవద్దని, గ్రామ పంచాయతీలో తేల్చుకుందాం అంటూ వారిని ఒత్తిడి చేశారు. గ్రామ పంచాయతీ పెద్ద ఒత్తిడికి తలొగ్గిన బాధితురాలి తల్లిదండ్రులు.. పంచాయతీకి వెళ్లారు. 
 
దీనిపై గ్రామస్థుల సమక్షంలో ఈ నెల 21వ తేదీన విచారణ జరిపిన గ్రామ పెద్దలు నిందితుడికి కేవలం ఐదు గుంజీలను శిక్షగా విధించారు. ఆ తర్వాత అతన్ని స్వేచ్ఛగా వదిలివేశారు. గ్రామ పెద్దలు విధించిన శిక్షతో గ్రామస్థులు విస్తుపోయారు. 
 
బాధితురాలికి గ్రామ పెద్దలు న్యాయం చేస్తారని భావిస్తే, నిందితుడికి న్యాయం చేశారంటూ అసహనం వ్యక్తం చేశారు. అత్యాచారం చేసిన నిందితుడితో ఐదు గంజీలు తీయించి, ఎలా వదిలి వేస్తారంటూ గ్రామస్థులు నిలదీస్తున్నారు. పైగా, దీనిపై అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.