గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (14:52 IST)

భాజపా బంపర్ ఆఫర్? జగన్ ఆ పని చేస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈమధ్య కాలంలో తరచూ ఢిల్లీ పెద్దలను కలుసుకుంటున్నారు. ఆమధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అప్పట్లో అమిత్ షా సీఎం జగన్‌ను మందలించారంటూ వార్తలు హల్చల్ చేసాయి. కానీ మేటర్ వేరేగా వుందంటున్నారు. ఎన్డీఏలో వైసీపిని చేరమంటూ అమిత్ షా కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఒకసారి ప్రధానితో కూడా సమావేశం కావాలని అమిత్ షా కోరిన నేపధ్యంలో జగన్ మరోసారి ఢిల్లీలో ప్రధానితో భేటీ అయినట్లు తెలుస్తోంది.
 
ఈ భేటీలో ప్రధానమంత్రి వైసిపికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్డీయేలో చేరితో రెండు కేంద్ర మంత్రి పదవులతో పాటు ఒక సహాయమంత్రి పదవిని ఇస్తామని ఆఫర్ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఐతే భాజపా ఆఫర్‌ను సీఎం జగన్ స్వీకరిస్తే ఏపీలో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ అగమ్యగోచరంగా మారే అవకాసం వుందంటున్నారు.
ఎందుకంటే, ఇటీవలి కాలంలో భాజపాతో కలిసి ఉద్యమాలు, ప్రభుత్వంపైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్న జనసేన పార్టీ, ఒకవేళ జగన్ పార్టీ కేంద్రంలో చేరితే ఏం చేయాలో తెలియని స్థితి. ఎందుకంటే కేంద్రంలో వున్నది మిత్రపక్షం. ఆ పక్షం పాలనా పగ్గాల్లో వైసిపి కూడా భాగం పంచుకుంటే పవన్ కళ్యాణ్ ఇక వైసిపిని విమర్శించలేని పరిస్థితి తలెత్తుతుంది. ఒకవేళ పార్టీ నుంచి బయటకు వస్తే, ఒంటరి పోరాటం అవుతుంది. ఎటు చూసినా పవన్ కళ్యాణ్ పరిస్థితి అగమ్యగోచరమవుతుంది. ఐతే వైసిపి చేరిక విషయంపై అటు వైసిపి కానీ ఇటు భాజపా కానీ స్పందించలేదు.