1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
  4. Happy Kartik Purnima 2017

నేడు కార్తీక పౌర్ణమి... భక్తజనసంద్రంగా శివాలయాలు

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలు కార్తీక శోభతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా, కార్తీకమాసంలో పౌర్ణమి తిథి శనివారం కావడంతో తెల్లవారుఝామునుంచే తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్దఎత్తున నదీ తీరా

Happy Kartik Purnima 2017
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలు కార్తీక శోభతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా, కార్తీకమాసంలో పౌర్ణమి తిథి శనివారం కావడంతో తెల్లవారుఝామునుంచే తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్దఎత్తున నదీ తీరాల్లో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. 
 
తెలుగు రాష్ట్రాల్లో గత యేడాది కృష్ణా పుష్కరాలు, అంతకుముందు సంవత్సరం గోదావరి పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఘాట్లన్నీ, ఇప్పుడు భక్తులతో కిక్కిరిసిపోయి, మరోసారి పుష్కరశోభను తలపిస్తున్నాయి. పంచారామాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 
 
గోదావరి నది ఒడ్డున ఉన్న బాసర, వేములవాడ, ధర్మపురి, భద్రాచలం, రాజమహేంద్రవరంలోని గోష్పాద క్షేత్రం, కృష్ణానది ఒడ్డున ఉన్న అలంపురం, శ్రీశైలం, నాగార్జున సాగర్, అమరావతి, విజయవాడ ఘాట్ల వద్ద భక్తుల తాకిడి అధికంగా ఉంది. ప్రధానంగా శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద, విజయవాడ ఇంద్రకీలాద్రి దిగువన భవానీ ఘాట్ వద్ద వేల సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
 
అదేవిధంగా ప్రకాశం, గుంటూరు, ఉభయగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లోని సముద్ర తీర ప్రాంతాలకు భక్తులు పోటెత్తారు . పుణ్యస్నానాలు చేసిన భక్తులు సమీపంలోని శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో శివాలయాలన్నీ భక్తజనసంద్రంగా మారాయి. ఏపీలోని పంచారామాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతున్నాయి. శ్రీశైలం మల్లన్న ఆలయం భక్తులతో నిండిపోయింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తులు జరుపుకుంటున్నారు. 
About Writer
pnr
తర్వాతి కథనం
కార్తీక పౌర్ణమి వేడుకల్లో అపశృతి