శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By Selvi
Last Updated : సోమవారం, 11 ఆగస్టు 2014 (17:05 IST)

కృష్ణాష్టమి రోజున కంచు దీపంలో దీపారాధన చేస్తే?

సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. ఉట్ల పండుగ అనికూడా పిలువబడే శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఒక కీర్తనలో ఇలా సెలవిచ్చాడు 
 
"పైకొని చూడరె వుట్ల పండుగ నేడు
ఆకడ గొల్లెతకు ననందము నేడు
 
అడర శ్రావణబహుళాష్టమి నేడితడు
నడురేయి జనియించినాడు చూడ గదరే
 
అరుదై శ్రావణబహుళాష్టమి నాటి రాత్రి
తిరువవతారమందెను కృష్ణుడు
 
యిరవై దేవకిదేవి యెత్తుకొని వసుదేవు
కరములందు బెట్టితే కడుసంతోసించెను"
 
అట్టి మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలు) లేచి, తలస్నానము చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజామందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపుకుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి. 
 
పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ గంధము, పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ, ప్రతిమను ఉంచాలి. ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి.
 
తదనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పూజను ప్రారంభించాలి. కంచుదీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్ధం చేసుకోవాలి. ఇలా చేస్తే సకల సంపదలు సిద్ధించడంతో అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. పూజ చేసేటప్పుడు నుదుటన సింధూరం ధరించి, తూర్పు దిక్కున తిరిగి, "ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. 
 
ఇంకా పూజ సమయంలో బాలకృష్ణా స్తోత్రమ్, శ్రీ కృష్ణ సహస్రనామములు, శ్రీ మద్భావవతములతో శ్రీకృష్ణుడిని స్తుతించవచ్చు. తర్వాత శ్రీకృష్ణుడికి నైవేద్యాలు సమర్పించి, దీపారాధన గావించుకుని పూజను ముగించాలి.
 
ఇంకా కృష్ణష్టామి రోజున ఒంటిపూట భోజనం చేసి, శ్రీ కృష్ణుడికి పూజచేసి, శ్రీకృష్ణ దేవాలయాలు, గౌడీయ మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయించే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.
 
గోకులాష్టమి దినాన ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలముతో పాటు శ్రీ కృష్ణ నిత్యపూజ పుస్తకాలను అందజేస్తే.. సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం. మరి అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు..