శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (09:44 IST)

రిలయన్స్ గ్రూప్‌ ఉద్యోగులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్.. నీతా అంబానీ

దేశ వ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్, ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ కీలక ప్రకటన చేశారు. రిలయన్స్ గ్రూప్‌ ఉద్యోగులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని.. దానికయ్యే ఖర్చును కంపెనీయే భరిస్తుందని తెలిపారు.

ప్రభుత్వంపై భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. మిగతా కార్పొరేట్ కంపెనీలు కూడా తమ ఉద్యోగుల వ్యాక్సినేషన్ ఖర్చును భరిస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
 
రిలయన్స్ గ్రూప్‌తో పాటు దాని సబ్సిడరీ సంస్థల్లో లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులంతా కలిపి సుమారు 6 లక్షల వరకు ఉంటారు.. ఉద్యోగులతో పాటు వారి భార్యాపిల్లలు, తల్లిదండ్రులకు కూడా ఉచితంగా టీకా అందించనన్నట్లు తెలిపింది రిలయన్స్. ఈ లెక్కన దాదాపు 19 లక్షల మందికి అయ్యే కరోనా వ్యాక్సినేషన్ ఖర్చును ఆ సంస్థ భరించనుంది. రెండో డోసుల టీకాలను ఉచితంగానే వేస్తారు.
 
కాగా, మన దేశంలో మార్చి 1 నుంచి రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతోంది. సామాన్య ప్రజలకు టీకా అందుబాటులోకి వచ్చింది. 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్లు నిండిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు టీకాలు ఇస్తున్నారు. 
 
దేశవ్యాప్తంగా మొత్తం 10వేల ప్రభుత్వ వ్యాక్సినేషన కేంద్రాలు, 20వేల ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతోంది. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఉచితంగానే వ్యాక్సిన్ ఇస్తారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కరోనా టీకా వేస్తారు. ఐతే ఉచితం కాదు. ఒక్క డోస్‌కు రూ.250 చెల్లించాలి. వ్యాక్సిన్ ధర రూ.150 కాగా.. సర్వీస్ చార్జీ రూ.100. ఇంతకంటే ఎవరూ ఎక్కువగా వసూలు చేయకూడదు.
 
మనదేశంలో ప్రస్తుతం రెండు వ్యాక్సిన్‌ల వినియోగంలో ఉన్నాయి. పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవిషీల్డ్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకాలను ఇస్తున్నారు. 
 
ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో ముందుకెళ్తున్న ప్రధాని.. అందుకే స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కొవాగ్జిన్ టీకాను వేయించుకున్నారు. సీరం ఇన్‌స్టిట్యూట్ కూడా భారత్‌కు చెందిన కంపెనీయే అయినప్పటికీ.. ఆ వ్యాక్సిన్‌ను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది.