మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (20:17 IST)

ఈ ఒక్కటి చేస్తే చాలు... అన్ని అనారోగ్యాలను అధిగమించవచ్చు...

నేటీ బిజీ జీవితంలో ఒత్తిడి సాధారణమైపోయింది. ఇవి పలువురిలో మానసిక సమస్యలకు కారణాలవుతున్నాయి. చిన్నచిన్న సమస్యలు కలిసి మానసికంగా వేధిస్తున్నాయి. ఇవే ఎన్నో జబ్బులకు కేంద్రమౌతున్నాయి. ఈ మానసికమైన ఒత్తిడులను దూరం చేసుకోవడానికి ఒకే ఒక్క మందు, ఉచితమైనది ధ్యానం. ఆ ధ్యానం కూడా మన  చేతుల్లోనే వుంది. మన చుట్టూ కలుషితమైన వాతావరణం, ఎటు చూసినా అనవసర ప్రసంగాలు, నిత్యం సెల్‌ఫోన్‌ల సంభాషణలు, కోర్కెలు తారా స్థాయికి చేరుతున్నాయి. 
 
దీంతో మానవుడు తనలోనున్న అంతర్నిహిత శక్తిని వృధా చేసుకుంటున్నాడు. ఇలాంటి తరుణంలో మనిషి అతికొద్ది శ్రమతోనే నీరసించిపోతున్నాడు. ఈ శక్తిని మళ్ళీ రీచార్జ్ చేసుకోవాలనుకుంటే ధ్యానం ఒక్కటే మార్గమని ఆధ్యాత్మిక గురువులు పేర్కొంటున్నారు. 
 
ధ్యానం చేసేటప్పుడు మౌనం ఆవహిస్తుంది. ఈ మౌనంలో అనేక శక్తులు దాగున్నాయి. ముఖ్యంగా వాక్ శక్తి, మానసిక శక్తి కేంద్రీకృతమైవున్నాయి. మౌనం పాటించటంవల్ల ఏకాగ్రతా శక్తి పెరిగుతుంది. ఏవిధంగానైతే ఎండలో ఒక భూతద్దం పెట్టి సూర్యకాంతిని ఒక బిందువుగా కేంద్రీకరింపజేసి అది ఒక వస్తువును కాల్చివేస్తుందో అలాగే వాక్ శక్తి, మానసిక శక్తిని కేంద్రీకరిస్తే ప్రపంచంలో సైతం శాంతిని నెలకొల్పవచ్చు. 
 
మౌనం వలన మాటలు మృదుమధురంగా పలికే శక్తి లభిస్తుంది. ఆ శక్తి లేకపోతే నాలుక కత్తి కంటే పదునైనది. మౌనంకూడా భాషే.. మౌనభాషణ శక్తి వరదాయిని. ప్రేమామృత మాటలతో ఎలాంటివారినైనా మార్చవచ్చు. వారి జీవితాలను పరిపూర్ణం చేయవచ్చు.  
 
సత్య వచనాలను కూడా ప్రేమపూరితంగానే చెప్పాలి, పరుషంగా ఎట్టిపరిస్థితుల్లోనూ మాట్లాడకూడదు. మాట్లాడేది ఆత్మగాని నోరు కాదు కదా? ఆత్మ శాంతి కాముకమైనది. కాఠిన్యం, అసత్యం వల్ల గందరగోళం, చికాకు కలుగుతాయి. పరమాత్మునితో సంబంధం పెట్టుకుంటే ఆత్మ శక్తిని, శాంతిని సంపాదిస్తుంది. అప్పుడు మనం ఏది మాట్లాడినా విజయవంతమవుతుంది. ఎంత తక్కువగా మాట్లాడితే అవి అంత శక్తి వంతంగావుంటాయి. అనవసరమైన ఆలోచనలను అదుపు చేస్తే మనోబలం పెరుగుతుంది. 
 
శరీరంలో ప్రతి అవయవాన్ని విచ్ఛలవిడిగా పోనివ్వకుండా అంతర్ముఖం చేస్తే ఇంకా శక్తివంతమైన ఫలితాలు చేకూరుతాయి. మౌనం, రాజయోగం ద్వారా శారీరక బలం, ఆధ్యాత్మిక శక్తులను సంపాదించవచ్చు. ఈ రెండు శక్తుల వల్ల సత్ఫలితాలు పొందుతాం. అందుకే రోగులకు మందులతోబాటు ధ్యానంతోనూ చికిత్స చేస్తే సత్వర ఫలితాలను చూడగలుగుతాము.