మొటిమలకు కరివేపాకు వైద్యం..!
ఇంట్లో చేసే ఏ వంట అయినా కరివేపాకు లేకుంటే అది సంపూర్ణమైన రుచి కలిగి ఉండదు. ఇంటింట ప్రతి వంటకూ కరివేపాకు తప్పనిసరిగా వాడుతారు. కరివేపాకులో రుచి మాత్రమే కాకుండా ఔషధ గుణాలు మెండుగానే ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అందుకోసమే పలు విధాలైన సౌందర్య సాధనాలలో కరివేపాకు పొడిని ఉపయోగిస్తుంటారు.
సాధారణంగా అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా యుక్త వయస్సులో అందరికీ ముఖంపై మొటిమలు వస్తుంటాయి. వాటిని తగ్గించేందుకు చాలా మంది బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ, చేతికందిన క్రీములు వాడుతూ నానా రకాల తంటాలు పడుతుంటారు. అటువంటి వారు వంటకు ఉపయోగించే కరివేపాకును ట్రై చేసి చూడండి. కరివేపాకు చిగుళ్ళు, పసుపు, వేపాకు కలిపి నూరి, మొటిమలకు పెడితే అవి మటుమాయమవుతాయి. అంతేకాకుండా మళ్లీ ముఖంపై మొటిమలు రావు.
ఇటీల కాలంలో వాతావరణ కాలుష్యాల పుణ్యమా అని ముఖంపై, కళ్ల కింద ముడతలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కరివేపాకు ఆకులని పాలల్లో నూరి అందులో కాస్త ముల్తానిమట్టిని కలిపి ముఖానికి రాస్తే క్రమంగా ముడతలు తగ్గి, ముఖ తేజస్సు పెరుగుతుంది.