ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 అక్టోబరు 2021 (16:59 IST)

తైవాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం: 46 మంది సజీవదహనం

తైవాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున సంభవించిన ఈ ప్రమాదంలో 46 మంది సజీవదహనమైనారు. మరో 79 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 14మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
 
దక్షిణ తైవాన్‌లో కౌహ్సియుంగ్ నగరంలోని 13 అంతస్తుల టవర్ బ్లాక్‌లో తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగాయని స్థానిక అగ్నిమాపక శాఖ తెలిపింది. భారీగా ఎగిసిన అగ్నికీలల్లో 46 మంది చిక్కుకొని అక్కడిడక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనంలో కింద షాపింగ్ కాంప్లెక్స్​లు, పైన అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. 
 
మంటలను అదుపులోకి తీసుకొచ్చిన రక్షణ, సహాయ దళాలు, బాధితుల కోసం గాలిస్తున్నారు. అగ్నిప్రమాదానికి ముందు పేలుడు శబ్దం వచ్చినట్లు సమీప నివాసితులు స్థానిక మీడియాకు తెలిపారు. భవన శిథిలాల్లో చిక్కుక్కున్న వారిని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది నాలుగు గంటలకు పైగా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందనీ, భవనంలోని కింది అంతస్తుల్లో మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బంది వెల్లడించింది.