1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (09:27 IST)

తాలిబన్ల అరాచకం - డ్రగ్స్ బానిసను కడుపు మాడ్చి.. గుండు కొట్టించి

ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్ తీవ్రవాదుల అరాచకాలు నానాటికీ హెచ్చుమీరిపోతున్నాయి. ముఖ్యంగా, ఆప్ఘాన్‌లో మాదక ద్రవ్యాల బానిసలతో తాలిబన్లు వ్యవహరిస్తున్న తీరు వారి అరాచక పాలనకు నిదర్శనంగా నిలుస్తుంది. 
 
డ్రగ్స్ బానిసలను బాధితులుగా పరిగణించి సరైన వైద్య చికిత్స అందించాల్సిందిపోయి, అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు. కాబుల్‌లో వేల మంది నిరాశ్రయులు హెరాయిన్‌ లాంటి మత్తు పదార్థాలకు ఏళ్ల తరబడి అలవాటుపడ్డారు. దీనివల్ల వారి శరీరాలు చిక్కి శల్యమై, కళ్లలో జీవం కోల్పోయి జీవచ్ఛవాల్లా కనిపిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది అక్కడి రహదారుల వంతెనల కింద తలదాచుకుంటుంటారు. 
 
అయితే, తాలిబన్‌ పోలీసులు రాత్రిపూట అక్కడ ఆకస్మిక దాడులు జరిపి డ్రగ్స్‌ బానిసలను అదుపులోకి తీసుకుంటున్నారు. వారి చేతులు కట్టేసి బలవంతంగా ప్రత్యేక శిబిరాలకు తరలిస్తున్నారు. మొండికేసినవారిని కనికరం లేకుండా తీవ్రంగా కొడుతున్నారు. జైళ్లను తలపించే ఆ శిబిరాల్లో వారికి ప్రత్యక్ష నరకం చూపుతున్నారు. 
 
మత్తు పదార్థాల వినియోగాన్ని వదిలివేయాలని లేకపోతే చావుదెబ్బలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. బలవంతంగా శిరోముండనం చేయిస్తున్నారు. సరైన తిండి పెట్టకుండా ఆకలితో అలమటించేలా చేస్తున్నారు. ఇస్లాం విశ్వాసాల ప్రకారం మత్తు పదార్థాల వ్యసనపరులను సమాజ వినాశకారులని పేర్కొంటున్న తాలిబన్లు, ఆ అలవాటును మానిపించడానికి ఇలాంటి కర్కశ విధానాలే సరైన మార్గమని భావిస్తున్నారు.