1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (11:37 IST)

ఆప్ఘనిస్థాన్‌లో యుద్ధం ముగిసింది.. ఇకపై తాలిబనిస్థాన్ : తాలిబన్ ప్రకటన

ఆప్ఘనిస్థాన్‌లో యుద్ధం ముగిసినట్టు తాలిబన్ రాజకీయ ప్రతినిధి అధికారికంగా ప్రకటించారు. పైగా, ఇకపై ఆప్ఘనిస్థాన్ పేరు కూడా తాలిబనిస్థాన్‌గా మారనుంది. అదేసమయంలో అంతర్జాతీయ సమాజంతో శాంతియుత సంబంధాలకు తాలిబన్ పిలుపునిచ్చింది. 
 
తాలిబన్‌లు ఒంటిరిగా జీవించాలనుకోవడంలేదని, పాలనా విధానం, వ్యవహారాలు త్వరలో స్పష్టమవుతాయని ప్రతినిధి మొహమ్మద్‌ నయిం మీడియాకు తెలిపారు. షరియా చట్టంలో మహిళల, బాలికల హక్కులను, భావప్రకటన స్వేచ్ఛకు తాలిబన్‌ వర్గాలు గౌరవిస్తాయని అన్నారు. 
 
ఏ సమస్యలను పరిష్కరించడానికైనా అన్ని దేశాలు, సంస్థలు తమతో చర్చలు జరపాలని కోరుతున్నామని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ ప్రధాని అష్రఫ్‌ ఘనీ దేశాన్ని విడిచి పారిపోతారని ఊహించలేదని, అతని సన్నిహితులు కూడా ఊహించలేదన్నారు. 
 
దేశంలోని పౌరులు, వర్గాలు, సంస్థలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, వారికి అవసరమైన రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తామని అన్నారు. 20 ఏళ్ల యత్నాల, త్యాగాల ఫలితాలను తాలిబన్‌లు చూస్తున్నారని అన్నారు. తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించామని, ఇది తమ దేశ, ప్రజల స్వాతంత్య్రమని వెల్లడించారు. 
 
తమ దేశంలోకి ఎవరినీ అనుమతించమని, అలాగే తాము ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని స్పష్టంచేశారు. తాలిబన్‌లు ఏ దౌత్య సంస్థ కార్యాలయాలను, దేశ ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకోలేదని, పౌరులకు, దౌత్య కార్యకలాపాలకు భద్రత కల్పిస్తుందని నయిమ్‌ ఆయన స్పష్టం చేశారు.