1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 ఆగస్టు 2021 (15:27 IST)

దేశ భక్తిని చాటిన కరీంనగర్ జిల్లా రైతు.. పొలంలోనే స్వతంత్ర్య వేడుకలు

తెలంగాణా రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ రైతు తన పొలంలోనే స్వాతంత్ర్య  75వ వేడుకలను జరుపుకున్నారు. ఇది ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఇందుకోసం ఆయన తనపొలంలోనే భారతదేశ చిత్రపటాన్ని వరి పైరుతోనే సృష్టించారు. దానికి ఎదురుగా గట్టుపై జాతీయ జెండాతో ఈ వేడుకలను నిర్వహించారు. 

కాగా, ఈ రైతు పేరు జాతీయ ఉత్తమ రైతు అవార్డు గ్రహీత మల్లికార్జున్ రెడ్డి. ఈ మేరకు తన పొలంలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వరి పైరు సహాయంతో దేశ పటాన్ని చిత్రీకరించాడు. 20 గుంటల విస్తీర్ణంలో దేశ చిత్రపటం వచ్చే విధంగా వరి నాటాడు. నేటి నుంచి ఏడాది పొడవునా.. జాతీయ గీతం పాడటంతో పాటు ఉదయం పూట జెండాను ఆవిష్కరించి సాయంత్రం వితరణ చేయనున్నట్లు రైతు తెలిపాడు.
 
మల్లికార్జున్ రెడ్డి ఇప్పటికే వ్యవసాయంలో ఉత్తమ ప్రతిభ కనబర్చి అద్భుత ఫలితాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాడు. అదే స్ఫూర్తితో మరోసారి అందరిలో ఒక్కడిగా నిలవాలని ఈ 75వ స్వాతంత్ర్య దినోత్సవం రోజు తన దేశభక్తిని చాటాడు. ఆయన తన పొలంలో చిత్రీకరించిన వరి పటం తాజాగా అందరిని ఆకట్టుకుంటోంది.