శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 మే 2021 (11:04 IST)

భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా.. ఆస్ట్రేలియా కఠిన నిర్ణయం.. ఏంటది?

దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. దేశం నలుమూలలా వైరస్ విరుచుకుపడుతోంది. మునుపెన్నడూ లేనంత ఉధృతితో వ్యాపిస్తుండటంతో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో 4 లక్షలు దాటాయి.
 
ప్రపంచ వ్యాప్తంగా ఒక రోజులో ఇంత అత్యధిక కేసులు నమోదవడం, అదీ భారత్ లోనే చోటు చేసుకోవడం పరిస్థతి తీవ్రతను తెలుపుతోంది. గత 24 గంటల్లో శుక్రవారం.. 4,01,993 కేసులు నమోదయ్యాయి.
 
ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు భారత్ నుంచి రాకపోకలపై నిషేధం విధించాయి. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ఠ్యా విషయం తెలిసిందే. దీంతో భారత్‌లో 14 రోజులు ఉండి ఆస్ట్రేలియా వచ్చే తమ పౌరులకు 5 ఏండ్లు వరకు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. 
 
బయోసెక్యూరిటీ యాక్ట్ కింద ఆస్ట్రేలియ చర్యలు చేపట్టింది. స్వదేశీ పౌరులపై ఈ తరహా కఠినమైన ఆంక్ష విధించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత్ నుంచి ప్రయాణాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం మూడు వారాల క్రితమే తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే.