1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (11:25 IST)

చైనాతో కొత్త ప్రచ్ఛన్న యుద్ధం చేయాలని కోరుకోవట్లేదు.. కానీ..?: జో-బైడెన్

చైనాతో కొత్త ప్రచ్ఛన్న యుద్ధం చేయాలని తాము కోరుకోవడం లేదని అంటూనే అమెరికా అధినేత జో-బైడెన్ బెదిరింపులకు దిగారు. జి-7 సదస్సు ముగిసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నాటో సమావేశంలో పాల్గొనేందుకు కార్నివాల్‌ నుంచి నేరుగా సోమవారం నాడిక్కడకు చేరుకున్నారు. ట్రంప్‌ నాటోను పనికిరాని సంస్థ అంటూ పక్కన పెడితే, నాటోలో అమెరికా తిరిగి చేరుతున్నదని బైడెన్‌ చెప్పారు. 
 
చైనాను కట్టడి చేసేందుకు నాటో సన్నద్ధంగా ఉండాలని బైడెన్‌ అన్నారు. 72 ఏళ్ల ఈ కూటమికి అమెరికా దన్నుగా ఉంటుందని చెప్పారు. కాగా రష్యాతో కలసి చైనా తన సైన్యాన్ని ఆధునీకరించుకోవడం, అణ్వా యుధాలను సమకూర్చుకుంటూ తమతో పోటీపడాలని చూస్తే ఊరుకునేది లేదని సంపన్న దేశాల ఆధ్వర్యంలోని సైనిక కూటమి నాటో బెదిరించింది. 
 
నాటో నేతల సమావేశంలో భాగంగా ఈ కూటమి అధిపతి జీన్స్‌ స్టాల్టెన్‌బర్గ్‌ మాట్లాడుతూ, మిలిటరీ, రక్షణ సాంకేతిక పరిజ్ఞాన పరంగా నాటోకు సరి సమంగా బలం పెంచుకోవాలని చైనా యత్నిస్తోందని, దీనిని తాము ఎంతమాత్రం సహించబోమన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత కమ్యూనిస్టు ప్రాబల్యం విస్తరించకుండా అడ్డుకునేందుకు అమెరికా, యూరోపియన్‌ దేశాలు కలసి ఈ రాజకీయ, సైనిక కూటమిని ఏర్పాటు చేశాయి. కాగా ప్రస్తుతం ఈ కూటమిలో 30 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.