శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2019 (13:41 IST)

ప్రాణాలు ఫణంగా పెట్టి మొసలి కళ్లు పీకేసి ఫ్రెండ్‌ను కాపాడింది...

ఓ యువతి తన ప్రాణాలు ఫణంగా పెట్టి తన స్నేహితురాలి ప్రాణాలను కాపాడింది. ఈ క్రమంలో మొసలి నేత్రాలను పీకేసింది. ఈ ఘటన జింబాబ్వేలోని సిందెరేలా అనే గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన రెబెకా ముంకోబ్వే అనే బాలిక తన స్నేహితులతో కలిసి సరదాగా చెరువు వద్దకు వెళ్లింది. స్నేహితురాళ్లంతా కలిసి అందులో ఈత కొడుతున్న సమయంలో లయోటా మౌవానీ (11) అనే బాలికను ఓ మొసలి లోపలికి లాక్కెళ్లడానికి ప్రయత్నించింది. ఈ విషయాన్ని గుర్తించిన రెబెకా మొసలితో పోరాడింది.
 
మొసలిపైకి ఎక్కి పిడిగుద్దులు కురిపించి, దాని కళ్లు పీకేసింది. దీంతో తీవ్ర నొప్పితో మొసలి లయోటాను వదిలి నీళ్లలోకి వెళ్లింది. లయోటాను తన వీపుపైన ఎక్కించుకుని చెరువులోంచి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చి, ఆమె ప్రాణాలను కాపాడింది. లయోటాకు స్వల్పగాయాలు కావడంతో ఆమెను ఓ ఆసుపత్రికి తరలించారు. స్నేహితురాలిని కాపాడిన రెబెకాపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
 
ఈ ఘటనపై రెబెక్కా మాట్లాడుతూ.. అక్కడ ఈత కొడుతున్న వారిలో తానే పెద్దమ్మాయిని. లటోయాను మొసలి పట్టుకునేసరికి ఆమెను కాపాడేందుకు ధైర్యం చేశాను. మొసలిపైకి దూకి కళ్లపై దాడి చేశారు. దీంతో అది కాస్త పట్టువదిలింది. లటోయా గాయాలతో మొసలి నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత ఇద్దరం చెరువు ఒడ్డుకు చేరుకున్నాం అని రెబెక్కా తెలిపింది. తన బిడ్డ ప్రాణాలతో బయటపడినందుకు లటోయా తండ్రి దేవుడికి కృతజ్ఞతలు చెప్పారు.