శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (19:07 IST)

హిందూ ఆలయ ప్రారంభోత్సవంలో పాక్ చీఫ్ జస్టిస్.. ప్రత్యేక పూజలు

పాకిస్థాన్‌ దేశంలో మైనార్టీలుగా ఉన్న హిందువులకు ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గుల్జార్‌ అహ్మద్‌ అండగా నిలిచారు. ఇటీవల కొందరు దుండగులు ధ్వంసం చేసిన ఓ హిందూ దేవాలయాన్ని ప్రభుత్వమే పునర్నిర్మించేలా చేశారు. అంతేకాకుండా, ఆ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
 
కరాక్‌ జిల్లాలోని తేరి గ్రామంలో ఉన్న శ్రీ పరమ హన్స్‌ జీ మహారాజ్‌ ప్రాచీన దేవాలయాన్ని గతేడాది డిసెంబర్‌లో కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సీజే జస్టిస్‌ గుల్జార్‌ అహ్మద్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్థానిక ప్రభుత్వం వెంటనే ఆ ఆలయాన్ని పునర్నిర్మించాలని, ఇందుకు అయ్యే ధనాన్ని ఆలయాన్ని ధ్వంసం చేసిన వారి నుంచే రాబట్టాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
దీంతో ధ్వంసమైన ఆలయాన్ని ప్రభుత్వం పునర్నిర్మించింది. దీపావళి పండగ నేపథ్యంలో సోమవారం ఈ ఆలయాన్ని తిరిగి తెరిచారు. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్థానిక హిందువులు అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు సీజే హాజరై ప్రత్యేక పూజలు చేసి, దీపావళి పండుగను కూడా జరుపుకొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు ఎల్లవేళలా మైనార్టీల హక్కులను పరిరక్షిస్తుందని తెలిపారు. రాజ్యాంగపరంగా పాకిస్థాన్‌లోని ఇతర మతాలవారికి లభించే స్వేచ్ఛ, హక్కులు హిందువులకు కూడా ఉంటాయన్నారు. మతస్వేచ్ఛను సుప్రీంకోర్టు కాపాడుతుందని, ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదని సీజే జస్టిస్‌ గుల్జార్‌ అహ్మద్‌ స్పష్టం చేశారు.