మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 3 ఆగస్టు 2017 (02:35 IST)

భారత్‌తో యుద్ధం చేస్తే తట్టుకోలేం.. చైనా మిలిటరీ నిపుణుల హెచ్చరిక

ఇండియాతో సరిహద్దు తగవు ముదిరి యుద్దమే సంభవిస్తే ఘోరంగా నష్టపోయేది చైనాయే కాని భారత్ కాదని చైనా మిలటరీ నిపుణులు తమ ప్రభుత్వాన్ని హెచ్చిరించారు. ఇండియాతో యుద్ధమే సంభవిస్తే చైనా రోడ్‌– బెల్ట్‌ ప్రాజెక్టు, ముడి చమురు సరఫరా మార్గం ఇబ్బందుల్లో పడతాయని మకా

ఇండియాతో సరిహద్దు తగవు ముదిరి యుద్దమే సంభవిస్తే ఘోరంగా నష్టపోయేది చైనాయే కాని భారత్ కాదని చైనా మిలటరీ నిపుణులు తమ  ప్రభుత్వాన్ని హెచ్చిరించారు. ఇండియాతో యుద్ధమే సంభవిస్తే చైనా రోడ్‌– బెల్ట్‌ ప్రాజెక్టు, ముడి చమురు సరఫరా మార్గం ఇబ్బందుల్లో పడతాయని మకావ్‌కు చెందిన చైనా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండు దిగ్గజాల మధ్య పోరు జరిగితే రోడ్‌–బెల్ట్‌ ప్రాజెక్టుకు ఎనలేని నష్టం వాటిల్లుతుందని చైనా సైనికరంగ నిపుణుడొకరు హెచ్చరించారు. డోక్లాం పేరుతో చైనా యుద్ధవాతావరణం సృష్టించి, ఇండియాను నొప్పిస్తే దాన్ని శత్రుశిబిరంలోకి నెట్టినట్టవుతుందని ఆయన అన్నారు.
 
ఏకకాలంలో బుజ్జగించి, బెదిరించే వ్యూహాలతో చైనా ఇతర ఆగ్నేయాసియా దేశాలను లొంగదీసినట్టు ఇండియాను తన దారిలోకి తెచ్చుకోవడం కుదిరేపని కాదనేది ఆయన నిశ్చితాభిప్రాయం. రోడ్‌–బెల్ట్‌ ప్రాజెక్టులో భాగస్వామి కావడానికి మొదట్నుంచీ వెనుకాడుతున్న ఇండియా ప్రస్తుత ఉద్రిక్తత వల్ల అసలు అందులో  చేరకపోయే ప్రమాదముందని మరొక నిపుణుడు చైనా సర్కారును హెచ్చరిస్తున్నారు.
 
చైనా–పాకిస్తాన్‌ ఆర్థిక కారిడార్‌ ప్రాజెక్టులో భాగంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో చైనా 4,500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టి మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులు చేపట్టింది. ఉత్తర భారత సరిహద్దు యావత్తూ సమరాంగణమైతే భారత సేనలకు ఇవి లక్ష్యంగా మారతాయి. అప్పుడు చైనా భారీగా నష్టపోతుంది. ఇటీవల శ్రీలంకలోని హంబంతోతట్‌ రేవు, పాక్‌లోని గ్వాదర్‌ పోర్టులో కొన్ని సౌకర్యాలు పొందడానికి చైనా ఒప్పందాలు చేసుకుంది. ఆఫ్రికా దేశం జిబూటీలో చైనా సైనిక స్థావరం శరవేగంతో పూర్తవుతోంది. యుద్ధం ఆరంభమైతే ఈ  ప్రాంతాలన్నీ భారత నౌకాదళ దాడుల పరిధిలోకి వస్తాయి.
 
భారత్‌–చైనా సరిహద్దులో వివాదం నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధమే వస్తే చైనాకే ఎక్కువ నష్టమనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ప్రపంచ జనాభాలో 35 శాతం(260 కోట్లు) నివసించే ఈ రెండు భారీ దేశాలూ ఓ చిన్నపాటి సరిహద్దు గొడవతో అసలు పోరుకు దిగుతాయా అన్నదే ప్రస్తుత ప్రశ్న. ఈశాన్య సరిహద్దులో భారత, చైనా సేనలు కేవలం 150 మీటర్ల ఎడంలో నిలబడి ఉన్నాయి. ఒకవేళ యుద్ధమే మొదలైతే పోరు ఒక్క సిక్కిం సెక్టార్‌కే పరిమితం కాదనీ, అరుణాచల్‌ నుంచి జమ్మూకశ్మీర్‌ వరకూ విస్తరిస్తుందని నిపుణుల అంచనా. 1962లో మాదిరిగా సరిహద్దు మొత్తం సమరాంగణమైతే చైనాకే అననుకూల పరిస్థితులు ఎక్కువ.
 
చైనాకు 80 శాతానికి పైగా ముడి చమురు సరఫరా జరిగే మలాకా జలసంధి (మలేసియా, ఇండొనేసియా మధ్య) అండమాన్‌–నికోబార్‌ దీవులకు సమీపంలో ఉంటుంది. ఆ ప్రాంతం గుండా జరిగే ముడిచమురు రవాణాపై యుద్ధ ప్రభావం పడుతుంది. దీవుల్లో భారత్‌కు భారీ నౌకాదళ కేంద్రం ఉంది. నౌకాదళం రంగంలోకి దిగితే, చైనా ఓడలు అండమాన్‌ పక్క నుంచి పోవడం కష్టమే. 1999లో కార్గిల్‌ యుద్ధసమయంలోనూ ఈ కారణం వల్లనే పాకిస్తాన్‌కు చైనా సాయం చేయలేదు.