శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 22 ఫిబ్రవరి 2020 (10:08 IST)

చైనా జైళ్ళకు పాకిన కరోనా.. 500 మందికి పైగా ఖైదీలకు వైరస్‌

చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్ ఇపుడు ఆ దేశంలోని జైళ్ళకు కూడా పాకింది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లోని జైళ్ళలో ఉన్న ఖైదీల్లో 500 మందికి ఈ వైరస్ సోకినట్టు వైద్యులు చెబుతున్నారు. అలాగే, చైనాలో కొత్తగా 889 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 2247గా ఉంది. వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 76,700కు చేరింది.
 
ఈ వైరస్‌కు కేంద్రంగా ఉన్న వుహాన్ నగరంలో పరిస్థితి మరింత భయానకరంగా ఉంది. ఈ వైరస్ బారినపడిన రోగులకు చికిత్స చేసేందుకు వెళ్లిన వైద్యుడు ఒకడు తాజాగా చనిపోయాడు. ఇకపోతే, చైనా తర్వాత అత్యధిక కొవిడ్‌-19 కేసులు జపాన్‌ తీరంలోని నౌకలో నమోదయ్యాయి. అలాగే ఇరాన్‌లో కొవిడ్‌-19 కారణంగా ఇద్దరు చనిపోయారు.
 
దక్షిణ కొరియాలో వైరస్‌ బాధితుల సంఖ్య 204కు చేరింది. ఈ వైరస్‌ సోకిన ఒక వృద్ధురాలు స్థానిక చర్చిలో ప్రార్థనలు చేయడానికి వెళ్లినప్పుడు ఆమె ద్వారా చాలా మంది ఈ వైరస్‌ బారిన పడినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. చైనా నుంచి స్వదేశానికి తరలివచ్చిన 45 మంది ఉక్రెయిన్‌ వాసులకు చేదు అనుభవం ఎదురైంది. వారిని దేశంలోకి అడుగుపెట్టనివ్వొద్దంటూ పలువురు ఆందోళనలకు దిగారు. 
 
మరోవైపు, కరోనా వైరస్‌ నివారణకు గల అవకాశాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయని, అంతర్జాతీయ సమాజం ఇప్పటికైనా కలిసిరాకుంటే పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పరిస్థితి చేయిదాటిపోక ముందే ప్రపంచం మేలుకోవాలని ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.